గవర్నర్ విచక్షణాధికారం: ముఖ్యమంత్రికి 6 పేజీల లవ్ లెటర్: సాయంత్రానికి రిప్లై: ప్రధానికి ఫోన్
జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు మరింత ముదిరాయి. పాకాన పడ్డాయి. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిస్థితులకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్కు ఉద్వాసన పలకడంతో తలెత్తిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తీసుకుంటోంది. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. సచిన్ పైలెట్పై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ను స్పీకర్ సీపీ జోషి వెనక్కి తీసుకున్నారు.
నాడు చంద్రబాబు..నేడు అశోక్ గెహ్లాట్: ఆడియో టేపుల కలకలం: రాజస్థాన్ ప్రభుత్వం అనూహ్య ఆదేశాలు
అదే సమయంలో బహుజన్ సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం కావడానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు దాఖలు చేసిన పిటీషన్ను హైకోర్టు తోసిపుచ్చడం రాజస్థాన్లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. అసెంబ్లీని సమావేశ పర్చాలనుకుంటోన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా హైఓల్టేజీ షాక్ ఇస్తున్నారు. అసెంబ్లీని సమావేశ పర్చి, తన బలాన్ని నిరూపించుకోవడానికి అశోక్ గెహ్లాట్ చేస్తోన్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.
గవర్నర్ అనుమతి ఇస్తే గానీ.. అసెంబ్లీని సమావేశపర్చడం సాధ్యం కాదని, ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అశోక్ గెహ్లాట్ నిప్పులు చెరుగుతున్నారు. కల్రాజ్ మిశ్రాపై కొన్ని రాజకీయ శక్తుల ఒత్తిడి ఉందని, అందుకే ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా అసెంబ్లీని సమావేశపర్చడానికి అవకాశం ఉందని, అయినప్పటికీ.. గవర్నర్ తన అధికారాలను వినియోగించి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
తనకు ఆరు పేజీల ప్రేమ లేఖ అందిందని, దానికి ఈ సాయంత్రానికి బదులిస్తానని తేల్చి చెప్పారు. ఈ లవ్ లెటర్కు ఎలా బదులు ఇవ్వాలో తనకు బాగా తెలుసునని గెహ్లాట్ చెప్పారు. గవర్నర్ వ్యవహారంపై తాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల దృష్టికి తీసుకెళ్లానని అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఆదివారం సాయంత్రమే తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని, కల్రాజ్ మిశ్రా పనితీరు, ఆయన వైఖరిని వివరించానని అన్నారు. రాష్ట్రపతికి లేఖ రాశానని చెప్పారు.
రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నారని, కొన్ని రాజకీయ శక్తులకు తలొగ్గుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీని సమావేశపర్చితే.. ఎవరేమిటనేది తేలిపోతుందని, ఆ పరిస్థితి రాకుండా తనను అడ్డుకుంటున్నారని అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీని సమావేశ పర్చాలంటూ చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తోసిపుచ్చడం 70 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు.