గోవాలో బీజేపీ కొంప ముంచింది ఈయనే: ఇప్పుడేం చేస్తారు!
పనాజి: గోవాలో అధికారంలో ఉన్న కమలం పువ్వు పూర్తిగా వికసించకపోవడానికి ఒకేఒక వ్యక్తి కారణం అయ్యారు. అరేబియా సముద్రతీరంలో మరోమారు వికసించాలని కలలుగంటున్న కమలనాథుల ఆశలపై నీళ్లు చల్లి తన సత్తాచాటుకున్నారు.
బీజేపీ నాయకులకు చుక్కలు చూపించిన ఆ నాయకుడి పేరు సుభాష్ వెలింగ్ కర్. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయిన సుభాష్ వెలింగ్ కర్ ను ఆర్ఎస్ఎస్ వెలివేయడంతో ఆయన బీజేపీ నాయకుల మీద కక్షకట్టి కత్తులు నూరుతున్నారు.
13 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్ లో చేరిన సుభాష్ వెలింగ్ కర్ 55 ఏళ్లపాటు ఆ సంస్థలో పని చేశారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం 2013లో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన సుభాష్ వెలింగ్ కర్ ను ఆర్ఎస్ఎస్ వెలివేసింది.
బీజేపీ మీద కక్ష కట్టిన ఆయన 2016లో గోవా సురక్షా మంచ్ (జీఎస్ఎం) పార్టీని ఏర్పాటు చేసి బిజెపియేతర కూటమి ఏర్పాటులో భాగంగా మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజీపీ), శివసేనతో పొత్తుపెట్టుకుని 2017 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ దెబ్బతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఓట్లు చీలిపోవడంతో అధికారంలో ఉన్న కమలనాథులు కంగుతిన్నారు.