45 వీడియోలు బ్యాన్, 10 చానెళ్లపై చర్యలు, కారణమిదే..
విద్వేషపూరిత చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతుంది. కొందరు తమ భావజాలాన్ని సులువుగా వ్యాప్తి చేస్తున్నారు. దీనిని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ గమనిస్తోంది. అలాంటి వారిపై కఠిన చర్యలకు ఉప క్రమిస్తోంది.
విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులపై కేంద్రం చర్యలు తీసుకుంది. 10 యూట్యూబ్ ఛానెళ్లపై యాక్షన్ తీసుకుంది.ఈ 10 యూట్యూబ్ ఛానెళ్లకు సంబంధించిన 45 వీడియోలను పూర్తిగా బ్లాక్ చేసింది. కశ్మీర్, భారత సైన్యం, ఇటీవలే కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్లపై అసత్యాలను ప్రచారం చేసేందుకు ఈ 10 యూట్యూబ్ ఛానెళ్లు పక్కా ప్రణాళిక రచించాయని గుర్తించింది.
మార్ఫింగ్ వీడియోలతో తాము అనుకున్న అంశాలను జనంలోకి వెళ్లేలా చేయడానికి ఈ ఛానెళ్లు ప్రయత్నించాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం గమనించింది. ఆ వెంటనే చర్యలకు ఉపక్రమించింది.
ఆ వీడియోలకు మంచి వ్యూహర్ షిప్ ఉంది. కోటి 30 లక్షల వ్యూస్ వచ్చాయి. అందులో యూట్యూబర్ ధ్రువ్ రతీ వీడియో కూడా ఒకటి బ్లాక్ అయ్యింది. దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి సమాచారం వచ్చింది. దీంతో సమాచార, ప్రసారాల శాఖ చర్యలు తీసుకుంది.
తప్పుడు సమాచారం, దేశానికి వ్యతిరేకంగా సమాచారం ప్రసారం చేయడం, జాతి వ్యతిరేక చర్యల కింద వాటిని పరిగణించారు. ఈ మేరకు ఐబీ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఐటీ యాక్ట్ 2021 రూల్ కింద సదరు వీడియోలపై చర్యలు తీసుకున్నారు. అలాగే అవీ ఫేక్ న్యూస్ అవీ మార్ప్డ్ వీడియో అని తెలిపారు.