ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం - ధరల పెరుగుదల, కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరగడం, చాలా చోట్ల కొరత నెలకొనడం, నాణ్యతలేని ఉల్లిని కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ)' విభాగం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Recommended Video
చైనా టెన్షన్: కేంద్రం తొలి అధికారిక స్పందన - ఉభయసభల్లో సుమోటోగా రాజ్నాథ్ - డ్రాగన్ నిఘాపై ఇలా..
ఉల్లి ఎగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వెలువడే దాకా ఎగుమతులు నిలిపివేయాలని డీజీఎఫ్టీ ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే 25 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో సున్నితమైన ఉల్లి పంటపై ప్రతికూల ప్రభావం పడిందని, పంటలు పాడైపోవడం, నిల్వ ఉంచిన సరుకు దెబ్బతినడంతో ఉల్లి కొరత కొరత ఏర్పడింది. గతేడాది కూడా ఈ సీజన్ లో ఉల్లి కొరత ఏర్పడటం తెలిసిందే. కొరతకు తోడు దళారుల అక్రమ దందాతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.
దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే కిలో ఉల్లిపాయల ధర రూ.40కి చేరింది. తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ప్రస్తుతానికి కిలో రూ.20కు అటు ఇటుగా ఉన్నప్పటికీ.. కొద్ది రోజుల్లోనే ధరలకు రెక్కలు రావొచ్చనే అంచనాలున్నాయి. కొందరు వ్యాపారులు ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కూడా కేంద్రం భావిస్తున్నది. మొత్తంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే ఎగుమతులపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.