'సరస్వతి' నది ప్రవహించడం నిజం: మళ్లీ పారిస్తామని ఉమ!
న్యూఢిల్లీ: త్రివేణీ సంగమం అంటే గంగా, యమునా, సరస్వతి నదులు. అయితే సరస్వతి నదిని మం చూసింది లేదు. సరస్వతి నది ఉండేదా అని కనుగొనేందుకు ప్రభుత్వం వాల్దియా నిపుణుల కమిటీని నిమియంచింది. ఈ కమిటీ లోతుగా పరిశీలించి.. సరస్వతి నది పారింది నిజమేనని తేల్చింది.
సరస్వతి నది ఊహాజనితం కాదని, ఈ నది ఒకప్పుడు ఉండేదని నిపుణుల సంఘం నిగ్గు తేల్చింది. ఈ నదిలో మూడింట రెండొంతులు మన దేశంలో, ఒక వంతు ప్రస్తుత పాకిస్థాన్లో ప్రవహించేదని తెలిపింది.
సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మీదుగా ప్రవహించి రాణ్ ఆఫ్ కచ్ ద్వారా అరేబియా సముద్రంలో సంగమం అయ్యేదని, నది పొడవు 4 వేల కిలోమీటర్లు అని నిపుణుల సంఘానికి నేతృత్వం వహించిన ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు పద్మభూషణ్ కెఎస్ వాల్దియా తెలిపారు.
నదికి రెండు పాయలు ఉండేవన్నారు. ఆరు నెలల పాటు చేసిన అధ్యయనంలో భూమిలో అంతర్లీనంగా ఉన్న నదీప్రవాహ ఛాయలు సుస్పష్టంగా కనిపించాయన్నారు. ఘగ్గర్, సర్సుతి, హక్రా, నారా నదుల్లో దీనికి సంబంధించిన మూలాలున్నాయన్నారు.
హరప్పా నాగరికత కాలంలో సుమారు 1,700 వరకు చిన్నా, పెద్దా పట్టణాలు, గ్రామాలు ఈ నదీతీరంలో ఉండేవన్నారు. కొన్ని చోట్ల 30 అడుగుల లోతున ఇసుక మేటలు, మరికొన్నిచోట్ల అయిదు కిమీ వెడల్పున నీరు ప్రవహించిన ఛాయలు లభ్యమయ్యాయన్నారు.
సుమారు 5,500 ఏళ్ల క్రితం భారీ నది ప్రవహించేదని చెప్పేందుకు ఇవే ఆధారాలన్నారు. హర్యానా ప్రజలకు సరస్వతీ నది బాగా తెలుసుననీ, ఆ రాష్ట్ర రెవెన్యూ దస్త్రాల్లోనూ ఆ ప్రస్తావన ఉందన్నారు. నీళ్లు లేకుండా అక్కడి ప్రజలు అన్ని ఏళ్లు బతికుండరని చెప్పారు. పారే పెద్ద నదే అక్కడి వారికి అప్పుడు జీవన ఆధారం అన్నారు. అయితే అది ఏ నది అని కనుక్కోవడానికి పరిశోధనలు చేసి.. అది సరస్వతి అని గుర్తించామన్నారు.
కమిటీ నివేదిక పైన కేంద్రమంత్రి ఉమాభారతి స్పందించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు మొదలుపెడతామని తెలిపారు. నిపుణుల సంఘం సభ్యులు నిజాయతీగా నివేదిక ఇచ్చారనీ, ఎవరూ ప్రశ్నించలేని రీతిలో మంచి కృషితో దీనిని రూపొంచారన్నారు. దీనిపై నిపుణులతో సమగ్రంగా చర్చించి, కేంద్ర మంత్రిమండలికి సమర్పిస్తామన్నారు. మళ్లీ అక్కడ నీరు పారించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.