2వేల నోటుకు మంగళం పాడనున్న ప్రభుత్వం
Recommended Video
రెండేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దుతో రంగప్రవేశం చేశాయి రూ.2వేల నోట్లు. పెద్ద నోట్లు రద్దవడంతో కొత్తగా ప్రభుత్వం ఈ రెండువేల నోటును ప్రవేశ పెట్టింది. నాడు రెండువేల నోటు పొందేందుకు కస్టమర్లు గంటల తరబడి బ్యాంకు క్యూలైన్లలో నిల్చున్నారు. ఇప్పుడు ఆ నోటు కనుమరుగుకానుందా...? ఇకపై కనిపించదా..? ప్రస్తుతం ఉన్న రెండువేల నోట్లే చివరి నోట్లా... కొత్త నోట్లు ఇక రావా..?
2016, నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్ల రద్దు చేశాకా ఆ స్థానంలో రూ. 2వేల నోటును కొత్తగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నోటుకు కేంద్రం మంగళం పాడనున్నట్లు సమాచారం. ఇకపై రెండు వేల నోట్లు ముద్రణ ఆపివేసేందుకు కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేసి క్రమంగా రెండు వేల నోట్ల సర్కులేషన్ను నిలిపివేయాలని భావిస్తోంది. రెండు వేల నోట్లను కొందరు పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకుంటున్నారని అంతేకాకుండా పన్ను ఎగవేతకు, మనీలాండరింగ్లకు కూడా 2వేల నోటును వినియోగిస్తున్నారన్న అనుమానం రావడంతో ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సమాచారం. రెండువేల నోటు ముద్రణ ఆగిపోయినా చెలామణిలో మాత్రం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఈ రెండువేల నోటును ప్రవేశ పెట్టింది. మార్చి 2018 నాటికి సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ విలువ మొత్తం రూ.18.03 ట్రిలియన్లు. ఇందులో రూ. 6.73 ట్రిలియన్లు లేదా 37 శాతం రెండువేల రూపాయల నోటు రూపంలోనే ఉన్నాయి. రూ.7.73 ట్రిలియన్ రూపాయలు లేదా 43 శాతం కరెన్సీ రూ. 500 నోట్లు రూపంలో ఉన్నింది. మిగతా కరెన్సీ తక్కువ విలువ చేసే డినామినేషన్లో ఉన్నాయి.
దేశంలో రూ.2వేల నోటును నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టగానే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. వెయ్యి రూపాయల్లో జరిగే అవినీతిని రెట్టింపు చేసి రెండువేలకు చేర్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పెట్టొచ్చని నాడు మోడీ చెప్పారు. అయితే చిన్న మొత్తం నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో పెద్ద నోట్లను ప్రవేశ పెట్టి నల్లధనానికి చెక్ ఎలా పెడతారని విపక్షాలు మండిపడ్డాయి.