దలైలామాపై భారత అభిప్రాయం మారదు, ఆయనకు పూర్తి స్వేచ్ఛ.. స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: టిబెట్కు చెందిన బౌద్ధమత గురువు దలైలామాపై భారత అభిప్రాయంలో ఎలాంటి మార్పు ఉండబోదని.. ఆయనను దేశ ప్రజలు ఎప్పటిలాగే గౌరవిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. దలైలామా కార్యక్రమాల నుంచి ప్రభుత్వ అధికారులు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
మార్చి చివరి, ఏప్రిల్ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దలైలామా కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం భారత్, చైనా మధ్య సున్నితమైన సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సీనియర్ నేతలు, ప్రభుత్వ అధికారులు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించినట్లు కొన్ని పత్రికలు, చానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ మేరకు కేబినెట్ సెక్రటరీ నుంచి ప్రకటన కూడా వెలువడినట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దలైలామా విషయంలో భారత్, చైనా మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత్లో దలైలామా పర్యటనలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించినట్లు వస్తున్న వార్తలు సంచనలంగా మారాయి.
ఈ నేపథ్యంలో దలైలామా, ఆయన కార్యక్రమాలపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. కేబినెట్ సెక్రటరీ ప్రకటన గురించి ఏం మాట్లాడకుండా... 'దలైలామా విషయంలో భారత అభిప్రాయం స్పష్టంగా, స్థిరంగా ఉంది. ఆయన ఓ మతగురువు. భారత ప్రజలు ఆయనను ఎప్పటికీ గౌరవిస్తారు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. భారత్లో మత కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది..' అని విదేశాంగ శాఖ పేర్కొంది.