భారత ఆర్థిక వ్యవస్థ పతనానికి అదే కారణం.. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 2019 చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 4.7 శాతానికి పడిపోయినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించడం ఆందోళనను మరింత తీవ్రం చేసింది. గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సవరించిన 5.1 శాతం వృద్ధిరేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బ్లూమ్బర్గ్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక వ్యవస్థ పతనానికి అదే కారణం..
దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనానికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. తమ రాజకీయ,సామాజిక ఎజెండాపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై మాత్రం దృష్టి సారించట్లేదన్నారు. పలు కీలక అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి చక్కదిద్దడానికి ఇంకా అవకాశం ఉందని అన్నారు. భారత్ను ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వానికి ఏ అంశాలు అడ్డు వస్తున్నాయన్న ప్రశ్నకు.. 'ఇది చాలా విచారకరం.. నా అభిప్రాయం ప్రకారం రాజకీయాలే కారణం' అని చెప్పారు.
ఆ నిర్ణయాలతో నష్టం వాటిల్లింది..
దురదృష్టవశాత్తు ఎన్నికల్లో భారీ విజయం తరువాత ప్రస్తుత ప్రభుత్వం 'ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టడం కంటే తన రాజకీయ, సామాజిక ఎజెండాను నెరవేర్చడంపై ఎక్కువ దృష్టి పెట్టింది' అని రాజన్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఆర్థిక మందగమనం కొనసాగుతూనే ఉందని.. దీనికి కారణం ప్రభుత్వం తొలినాళ్లలో తీసుకున్న నోట్ల రద్దు,లోప భూయిష్టమైన జీఎస్టీ వంటి సంస్కరణలేనని అభిప్రాయపడ్డారు.
పడిపోయిన ఆర్థిక వృద్ది రేటు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో గతేడాది డిసెంబర్ త్రైమాసికం నాటికి భారతదేశ వృద్దిరేటు 7 ఏళ్ల కనిష్టానికి పడిపోయి 4.7శాతంగా నమోదైంది.2012-13 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) తర్వాత ఇదే అత్యల్ప వృద్ధిరేటు. తయారీ రంగంలో ఉత్పత్తి తగ్గడమే తాజా పతనానికి ప్రధాన కారణమని శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. గత ఆర్థిక సంవత్సర (2018-19) మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.6 శాతంగా నమోదైంది.