2020: ఇస్రో నామ సంవత్సరం: గగన్ యాన్ కోసం నలుగురి ఎంపిక: త్వరలో చంద్రయాన్-3: ఇస్రో ఛైర్మన్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతోంది. గగన్ యాన్, చంద్రయాన్-3 సహా పలు భారీ ప్రాజెక్టులను చేపట్టబోతోంది. అంతరిక్షంలోకి మనుషులను పంపించడానికి ఉద్దేశించిన గగన్ యాన్ ప్రాజెక్టు పనులకు ఈ ఏడాదే ఆరంభించబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ ఏడాదిలో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను ఆయన వెల్లడించారు.
Amravati: నిరసనలతో స్వాగతం: హ్యాపీ న్యూ ఇయర్ కాదు..సేవ్ అమరావతి అంటూ ముగ్గులు..!
నలుగురి ఎంపిక..
మానవ సహిత ప్రయోగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు శివన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు ఆరంభం అయ్యాయని తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి నలుగురు భారతీయులను ఎంపిక చేశామని అన్నారు. వారి వివరాలను ఇప్పుడిప్పుడే వెల్లడించలేమని చెప్పారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తు వరకు మనుషులను తీసుకెళ్తామని, అక్కడి కక్ష్యలోకి వారిని ప్రవేశపెడతామని అన్నారు.
రష్యా సహకారంతో..
దీనికి రష్యా సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని శివన్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి అవసరమైన శిక్షణను రష్యా ద్వారా ఇప్పిస్తామని అన్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టు విఫలమైనప్పటికీ.. తాము వెనుకంజ వేయబోవట్లేదని శివన్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే చంద్రయాన్-3ని చేపట్టబోతున్నామని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిందని అన్నారు.
2021లో చంద్రయాన్-3
చంద్రయాన్-3 ప్రాజెక్టులు పనులు ఇప్పుడు చేపట్టినప్పటికీ.. దీన్ని వచ్చే ఏడాది ప్రయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని శివన్ తెలిపారు. చంద్రయాన్-2 వైఫల్యానికి సంబంధించిన దుష్ప్రభావం దీనిపై పడబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో తాము ఈ ప్రాజెక్టు పనులను మరింత ముమ్మరం చేస్తామని అన్నారు. ఆ వైఫల్యాల నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నామని చెప్పారు.
కొత్తగా రోవర్..
చంద్రయాన్-2 తరహాలోనే కొత్తగా చేపట్టబోయే ప్ప్రయోగంలో ల్యాండర్ ఉంటుందని, కొత్తగా రోవర్ ను జత చేసినట్లు తెలిపారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులో రోవర్ లేదని, ఈ సారి చంద్రుడి ఉపరితలాన్ని మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రోవర్ ను జత చేయబోతున్నామని శివన్ అన్నారు. దీనికోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞనాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు.
తమిళనాడులో రెండో ప్రయోగ కేంద్రం
ప్రస్తుతం ఉన్న శ్రీహరికోటకు అదనంగా మరో ప్రయోగ కేంద్రాన్ని నిర్మించబోతున్నామని శివన్ తెలిపారు. దీనికోసం తమిళనాడులోని తూత్తుకుడి వద్ద అవసరమైన భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. తూత్తుకుడి సముద్రతీర ప్రాంతంలో ఈ సరికొత్త ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. శ్రీహరికోటతో పాటుగానే తూత్తుకుడి నుంచీ ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పారు. ఎన్ని లాంచ్ ప్యాడ్లను నిర్మించాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని అన్నారు.