అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం: ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు: వాటి బలోపేతానికి
బెంగళూరు: అద్భుత ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది భారత్. వరుస ప్రయోగాలతో ఘన విజయాలను అందుకుంది. చిట్ట చివరి నిమిషంలో విఫలం అయినప్పటికీ.. చంద్రయాన్-2 మిషన్లో భారత శాస్త్రవేత్తలు సేవలు విస్మరించలేనివి. అంతరిక్ష ప్రయోగాల్లో.. సాంకేతిక పరిజ్ఙానంలో అగ్ర దేశాల సరసన నిలిచింది భారత్. అలాంటి అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Recommended Video
Coronavirus: బెంగళూరు- న్యూజిలాండ్ ఢీ, కరోనా కట్టడిలో ఎవరు గొప్ప, మీరే చెప్పండి, ఇది లెక్క!
ఫలితంగా- ఇస్రోలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల భాగస్వామ్యం ప్రారంభమౌతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇస్రో ఛైర్మన్ కే శివన్ స్వాగతించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పించాలనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దీనివల్ల అంతరిక్ష సాంకేతిక పరిజ్ఙానం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. స్పేస్ టెక్నాలజీలో వినూత్నమైన ఆవిష్కరణలకు ఇది కారణమౌతుందని అన్నారు.
దీని ఫలాలు సామాన్యులకు అందుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కీలకమైన సాంకేతికేతర రంగాల్లో అంతరిక్ష పరిజ్ఙానాన్ని వినియోగించడం, దాన్ని మిళితం చేయడం వల్ల మున్ముందు అద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ రంగంలో భారత్ ఇప్పటికే అనేక ఘన విజయాలను నమోదు చేసిందని, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల మరిన్ని ఘన విజయాలను అందుకోవడానికి బాటలు పరిచినట్టయిందని చెప్పారు.
అంతరిక్ష పరిజ్ఙానాన్ని మరిన్ని రంగాలకూ విస్తరింపజేయవచ్చని, దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న రంగాల్లో పురోభివృద్ధిని సాధించ వచ్చని శివన్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయం వంటి రంగాలకు అంతరిక్ష పరిజ్ఙానాన్న విస్తరింపజేయడానికి ప్రైవేటు భాగస్వామ్యం ఉపకరిస్తుందని చెప్పారు. స్పేస్ టెక్నాలజీని గరిష్ఠస్థాయిలో వినియోగించుకోవడానికి, దీని ఫలాలను సామన్యులకు అందజేయడానికీ కేంద్రం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఎదగడానికి ప్రైవేటు భాగస్వామ్యం అవసరమేనని శివన్ అంచనా వేశారు. ఇప్పటిదాకా స్పేస్ టెక్నాలజీలో పరిమితంగా ఉద్యోగ అవకాశాలు ఉండేవని, కేంద్రం నిర్ణయంతో ఈ అవకాశాలు మరింత విస్తృతమౌతాయని అన్నారు. ప్రైవేటు భాగస్వామ్యులను గుర్తించడంలో ఇస్రోను నోడల్ ఏజెన్సీగా ప్రకటించడం పట్ల శివన్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ప్రైవేటు భాగస్వామ్యులను ఎంపిక చేస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని ఇస్రోకు ఇవ్వడం పట్ల ఆయన కేంద్రానికి కృతజ్ఙతలు తెలిపారు.