తమిళనాడుకు సునామి హెచ్చరిక
చెన్నై: తమిళనాడుకు సునామి ముప్పు ఉందని భారతీయ సముద్ర సమాచార కేంద్రం (నేషనల్ మ్యారీటైమ్ ఇన్ఫర్మేషన్) హెచ్చరించడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. సునామీ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కులచ్చల్ నుంచి రామనాథపురం జిల్లా కీళక్కారై వరకు సముద్ర తీర ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల ఎత్తులో అలలు ఉదృతంగా ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
డిసెంబర్ 28వ తేది అర్దరాత్రి వరకు అలల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఈశాన్య దిశలో గంటకు 44 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
సముద్రంలో చేపల వేటకు ఎవ్వరూ వెళ్లరాదని హెచ్చరించారు. సునామీ హెచ్చరికతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే అప్రమత్తం కావాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కన్యాకుమారి వద్ద సముద్ర నీటి మట్టం పెరిగిందని అధికారులు గుర్తించారు.
వివేకానందస్వామి, తిరువళ్లువర్ విగ్రహాల వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. అక్కడికి రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. కన్యాకుమారిలో ఆదివారం ఉదయం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల తీవ్రత అధికం అయ్యిందని అధికారులు తెలిపారు.