కేంద్రం హింట్: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు ఎలా ఉంటాయంటే?
Recommended Video
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు తగ్గుతాయని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిందేననే డిమాండ్లు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. వాటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అలా తెస్తే వాటి ధరలు ఎలా ఉంటాయనే దానిపై కేంద్రం బుధవారం స్పష్టతను ఇచ్చింది.
ప్రస్తుతం ఉన్న ధరలే!
పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయి జీఎస్టీ కిందకు తీసుకు వచ్చినా, పూర్తిస్థాయిలో ఉండదని, 28 శాతం జీఎస్టీతో పాటు లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే మళ్లీ ప్రస్తుతం ఉన్న ధరలే ఉంటాయని చెబుతున్నారు. కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు అందుకు నో చెబుతున్నాయి.
జీఎస్టీ కిందకు పెట్రోల్కు రాష్ట్రాలు నో, మధ్యేమార్గంగా కేంద్రం
దీంతో పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలకు వచ్చే ఆదాయం నష్టపోని రీతిలో ఈ పని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్తో పాటు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. అదే జరిగితే తాము పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోవాల్సి ఉంటుదని చెబుతున్నాయి. పెట్రోల్, డీజిల్ను 28 శాతం స్లాబులో చేర్చి, అదనంగా వ్యాట్ చేర్చాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
దాదాపు అన్ని దేశాల్లో జీఎస్టీతో పాటు ఇతర పన్నులు
పెట్రోల్పై దాదాపు అన్ని దేశాలు జీఎస్టీతో పాటు ఇతర పన్నులు వడ్డిస్తున్నాయి. ఇక్కడా ఆ పద్ధతినే అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడం వల్ల ఏటా రూ.20,000 కోట్ల కేంద్రం ఆదాయానికి గండి పడుతుంది. రాష్ట్రాలు కూడా భారీగా నష్టపోతాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం దగ్గరా నిధులు అందుబాటులో లేవు. ఈ సమస్యను అధిగమించేందుకు జిఎస్టి+వ్యాట్ విధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఓ అధికారి వివరించారు. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
జీఎస్టీ, వ్యాట్
ప్రస్తుతం కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.19.48, డీజిల్పై రూ.15.33 చొప్పున ఎక్సైజ్ పన్ను విధిస్తోంది. దీనికి తోడు రాష్ట్రాలు వ్యాట్ వసూలు చేస్తున్నాయి. పెట్రోల్పై అత్యధిక వ్యాట్ ముంబైలో రూ.39.12గా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం డీజిల్పై అత్యధిక వ్యాట్ 26 శాతం విధిస్తోంది. ప్రస్తుతం ఉన్న పన్నులను మించకుండా వ్యాట్ విధించాలని కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనివల్ల వినియోగదారులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని తెలుస్తోంది.