కొత్త రూల్: బహిరంగంగా పొగత్రాగితే 20 వేల జరిమానా
న్యూఢిల్లీ: రాబోయే కాలంలో పొగరాయుళ్లను ఇబ్బందులు పాలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మార్చి నెలలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో సిగరెట్ల ధరను పెంచిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడం, లూజుగా సిగరెట్లు కొనడం, అమ్మడంపై నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ ఎత్తున జరిమానా విధించనుంది.
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధూమపానాన్ని అరికట్టవచ్చని, ప్రజలను రోగాల బారి నుండి కాపాడవచ్చని ఆలోచిస్తోంది. భారత్లో సిగరెట్ల లూజుగానే అమ్ముతుంటారు. ప్యాకెట్లు కొనుక్కోని తాగేవాళ్లు తక్కువ. ఒకటి రెండు సిగరెట్లు కొనుక్కోని అక్కడే బహిరంగంగా తాగేసి వెళ్లిపోతుంటారు. దేశంలో మొత్తం సిగరెట్ల అమ్మకాలు వాటాల్లో 70 శాతం ఇలాగే జరుగుతాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
బహిరంగ ధూమపానంపై రూ. 200 నుంచి రూ. 20 వేల వరకు జరిమానా విధించే విధానాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. సిగరెట్లు తాగే వయసు కూడా పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. సిగరెట్ ప్యాకెట్ పై ప్రభుత్వం నిర్థేశించిన చట్టబద్దమైన హెచ్చరిక కనిపించకపోతే కేవలం రూ. 5 వేలనే జరిమానాగా విధించేవారు. ఈ జరిమానాను రూ. 50 వేలకు పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ చెప్పడంతో ఈ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోనుందని సమాచారం.