ఎప్పటికీ భారత ప్రజల సంపదే: రైల్వే ప్రైవేటీకరణపై మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడం కోసమే కమర్షియల్, ఆన్బోర్డ్ సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రైల్వే మంత్రి సమాధానమిచ్చారు.
రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సభ్యులు ఈ విషయంపై పలు ప్రశ్నలు లేవనెత్తడంతో మంత్రి పీయూష్ గోయల్ వివరణ ఇచ్చారు. భారతీయ రైల్వే ఎప్పుడూ దేశ సంపద అని, ప్రజల సంపదగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భారతీయ రైల్వేలకు రాబోయే 12ఏళ్లలో సుమారు రూ. 50 లక్షల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. అంతేగాక, రోజుకో కొత్త డిమాండ్లు ముందుకొస్తున్నాయన్నారు. బడ్జెట్ పరిమితులు, ఇతర సమస్యల మూలంగా ఆ మొత్తం సమకూర్చుకోవడం ప్రభుత్వంతో సాధ్యం కాదని వివరించారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, పెట్టుబడులు కూడా అంతేనని చెప్పారు. ఒక వేళ ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులకు సిద్ధంగా ఉంటే అందుకు తాము సిద్ధమని, దీనివల్ల ప్రయాణికులే లబ్ధి పొందుతారని తెలిపారు. రైల్వే నిర్వహణను కార్పొరేటీకరణ చేస్తున్నామనే తప్ప ప్రైవేటీకరణ చేయడం లేదని రైల్వే సహాయ మంత్రి సురేశ్ తెలిపారు.