రాత్రి 11:59లోగా డబ్బులు కట్టండి... లేకుంటే మొబైల్ సేవలు బంద్?
వందలూ వేలు కాదు.. మొత్తం 1.47లక్షల కోట్ల రూపాయల బకాయిల్ని శుక్రవారం రాత్రి 11:59లోగా చెల్లించకపోతే సీరియస్ పరిణామాలు తప్పవంటూ ప్రైవేటు టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేయడం కలకలం రేపుతోంది. స్పెక్ట్రమ్ లైసెన్సు ఫీజు, వినియోగ చార్జీలు చెల్లించకుండా ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి మొత్తం 15 టెలికాం కంపెనీలు ఏళ్ల తరబడి సతాయిస్తున్న సంగతి తెలిసిందే. సర్దుబాట్లతో కూడిన ఏజీఆర్ విధానంలోనైనా బకాయిలు చెల్లించాని సుప్రీం కోర్టు ఆదేశించినా కంపెనీలు వినకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.
కోర్టు ఆగ్రహంతో కదిలిన డాట్..
ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో హైడ్రామా జరిగింది. ఏజీఆర్ బకాయిల గడువు పొడిగింపు కోరుతూ ఎయిర్ టెల్ భారతి, వోడాఫోన్ ఐడియా, ఇతర కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్స్ను కోర్టు తోసిపుచ్చింది. ఇంతవరకు బకాయిలు ఎందుకు వసూలు చేయలేదంటూ టెలికాం శాఖ(డాట్)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో డాట్.. సర్కిళ్ల వారీగా ఆయా కంపెనీలకు నోటీసులు పంపింది. శుక్రవారం అర్ధరాత్రి 11.59 గంటల్లోగా డబ్బులు చెల్లించాలని గడువు విధించింది.
మొబైల్ సేవలు బంద్ అంటూ పుకార్లు..
బకాయిలు చెల్లించాలంటూ టెల్కోలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ వెంటనే కేంద్రం డెడ్ లైన్ విధిస్తూ నోటీసులు జారీచేయడంతో షేర్ మార్కెట్లలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలపాలయ్యాయి. సోషల్ మీడియాలోనైతే.. టెల్కోలు అప్పులు కట్టకుంటే ఈ రాత్రి నుంచి మొబైల్ సేవలు నిలిచిపోతాయంటూ పుకార్లు వ్యాపించాయి. దీనిపై గందరగోళం కొనసాగుతుండగానే ఎయిర్ టెల్ సంస్థ మరో ప్రకటన చేసింది.
10వేల కోట్లు కడతాం..
టెల్కోల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం బకాయిలు రూ .1.47 లక్షల కోట్లలో ఎయిర్ టెల్ భారతి వాటా 35,500 కోట్లుకాగా.. డాట్ నోటీసుల తర్వాత తాము రూ.10 వేల కోట్లు చెల్లిస్తామంటూ ఆ కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఆ డబ్బును ఫిబ్రవరి 20లోగా చెల్లిస్తామని అప్పటిదాకా చర్యలు తీసుకోరాదని ఎయిర్ టెల్ పేర్కొంది. రూ.53వేల కోట్లు చెల్లించాల్సిన వోడాఫోన్ ఐడియా మాత్రం ఇలాంటి ప్రతిపాదనేదీ చేయలేదు. దివాలా తీసిన టాటా టెలీ సర్వీసెస్ కూడా ప్రభుత్వానికి 14వేల కోట్లు బాకీ పడిఉంది. రిలయన్స్ జియో తన రూ.177 కోట్ల బాకీని ఇప్పటికే చెల్లించేసింది.
మూసివేత తప్ప మరో దారిలేదు..
ఏజీఆర్ బకాయిల విషయంలో వోడాఫోన్ ఐడియా వాదన మాత్రం మరోలా ఉంది. బకాయిల చెల్లింపుల వ్యవహారాన్ని మళ్లీ విచారించాలని, లేదా చెల్లింపుల సరళీకరణ జరగాలని ఈ రెండు కాకుంటే తాము కంపెనీని మూసుకోవడం తప్ప మరో మార్గం లేదని మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. శుక్రవారం రాత్రిలోగా డబ్బులు కట్టాలంటూ డాట్ నోటీసుల జారీచేసిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కంపెనీ మూతపడితే వేలమంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు బ్యాంకులపైనా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.