రూ.3,700 కోట్ల ప్రాజెక్ట్: దేశంలోని 5.5లక్షల గ్రామాలకు వైఫై సౌకర్యం
కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. రూ.3,700కోట్ల ప్రణాళికతో దేశంలోని సుమారు 5.5లక్షల గ్రామాలకు మార్చి 2019లోపు వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. రూ.3,700కోట్ల ప్రణాళికతో దేశంలోని సుమారు 5.5లక్షల గ్రామాలకు మార్చి 2019లోపు వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను టెలీకాం శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
'2.5లక్షల జీపీ(గ్రామ పంచాయతీ)లకు సెప్టెంబర్లోనే టెండర్ వేయాలని నిర్ణయించాం. మార్చి 2019లోపు ఈ జీపీలకు పూర్తిస్థాయి వైఫై సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని టెలీకాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ తెలిపారు.
దేశంలోని అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించాలంటే 5.5లక్షల గ్రామాలకు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ను కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.3,700 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో దీన్ని చేపడుతున్నామని చెప్పారు.
ఈ సంవత్సరాంతానికి లక్ష గ్రామ పంచాయతీల్లో సెకనుకు 1000 మెగాబైట్లతో ప్రభుత్వం బ్రాండ్ బ్యాండ్ సేవలకు శ్రీకారం చుడుతోందని తెలిపారు. భారత్ నెట్ సర్వీస్ ద్వారా వీరికి వైఫై కల్పిస్తామని, ఈ నెట్ వర్క్ పూర్తయిన వెంటనే దేశంలోని అన్ని గ్రామాలకూ వైఫైని అందుబాటులోకి తెస్తామని వివరించారు.
30కోట్ల మంది ప్రజలకు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యాన్ని 2022 వరకు 70కోట్ల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6వరకే 33,430 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభమైందని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.