విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ... కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎండీ నియామకానికి ప్రభుత్వం నిరాకరణ
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్గా పేరొందిన విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి విజయ్ మాల్యాను నియమించేందుకు ప్రభుత్వం తిరస్కరించింది.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎండీగా ఆయన చేసుకున్న దరఖాస్తును కార్పోరేట్ వ్వవహారాలు మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్కు కింగ్ఫిషర్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో విజయ్ మాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫాల్టర్గా ప్రకటించిన విషయం తెలిసిందే.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు బాకీలిచ్చిన బ్యాంకుల్లో విజయ్మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్(ఎగవేతదారు)గా ప్రకటించిన తొలి బ్యాంకు ఇదే కావడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలో ఉన్న యునైటెడ్ బ్యాంకుకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దాదాపు 350 కోట్ల రూపాయలు బకాయి పడింది.
కన్సార్టియంలో కాకుండా విడిగా మరో 60 కోట్ల రూపాయలను ప్రీ-డెలివరీ పేమెంట్గా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు యునైటెడ్ బ్యాంక్ అందించింది. మరోవైపు మంగళూరు కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఎంసీఎఫ్) బోర్డు నుండి మాల్యా తప్పుకున్నారు. విజయ్ మాల్యా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు రాజీనామా చేశారని ఎంసీఎఫ్ కంపెనీ సోమవారం తెలిపింది.
ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అక్టోబరు, 2012లో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కింగ్ ఫిషర్ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.