హెచ్చరికే: నెస్లేపై రూ. 640 కోట్లకు కేంద్రం దావా
న్యూఢిల్లీ: అక్రమ వ్యాపార పద్ధతులను పాటించినందుకు, వినియోగదారులను మోసగించేలా ప్రకటనలు ఇచ్చినందుకుగాను పరిహారం కింద రూ.640 కోట్లు చెల్లించాలంటూ మ్యాగీనూడుల్స్ తయారీసంస్థ నెస్లే ఇండియాపై కేంద్రప్రభుత్వం దావా వేసింది.
వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం ఈ మొత్తం ఇప్పించాలంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)లో మంగళవారం కేసు దాఖలు చేసింది. దాదాపు 30ఏళ్ల 'వినియోగదారుల పరిరక్షణ చట్టం' చరిత్రలో ఒక కంపెనీపై ఈ విధంగా దావా వేయటం ఇదే తొలిసారి.
కేసు దాఖలు చేసిన విషయాన్ని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్పాశ్వాన్ ధృవీకరించారు. ఎంత పరిహారం కోరారన్నది మాత్రం ఆయన తెలియజేయలేదు. కాగా, రూ.640 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా అధికారవర్గాలు వెల్లడించాయి.
'వినియోగదారుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా భారతదేశంలో నాసిరకం ఉత్పత్తులను విక్రయించే కంపెనీలకు గట్టి సందేశం ఇవ్వటానికే నెస్లేపై ప్రభుత్వం ఈ కేసు దాఖలు చేసింది'అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తమకు ఇంతవరకూ ఎటువంటి సమాచారం అందలేదని నెస్లేఇండియా అధికారప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు ఉత్తర్ప్రదేశ్లోని లక్నో శివార్లలోని ఒక గోడౌన్లో 20,000 కిలోల మ్యాగీనూడుల్స్ను 'భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికారిక సంస్థ' అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఇవి అమ్మకానికి ఉద్దేశించినవి కావని, మార్కెట్ నుంచి వెనక్కితెస్తున్న నూడుల్స్ అని నెస్లే పేర్కొంది.