లక్ష కోట్లు..100 ఎయిర్పోర్టులు: 2024 మోడీ సర్కార్ ప్రణాళిక ఇదే..?
న్యూఢిల్లీ: 2024 నాటికల్లా దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు ప్రారంభం అవుతాయని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆసియా ఖండంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆర్థిక వృద్ధిని పెంపొందించే భాగంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025 వరకు కావాల్సిన మానవవనరులపై గతవారం జరిగిన సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు సమాచారం. చిన్న పట్టణాలు పల్లెలకు కొత్తగా 1000 రూట్లను కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధి
గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశ ఆర్థిక వృద్ధి తగ్గిపోవడం, మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రధాని మోడీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. తద్వారా 2025 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. గత నెలలో ప్రభుత్వం కార్పోరేట్ పన్నుల్లో కోత విధించింది. వియత్నాం ఇండోనేషియా దేశాలకు ప్రాజెక్టులు లేదా పెట్టుబడులు తరలి వెళ్లకూడదనే ఉద్దేశంతో కార్పోరేట్ పన్నులను తగ్గించింది. అయితే విమానాశ్రయాల అభివృద్ధిలో భారత్ చైనా కంటే వెనకపడి ఉంది. చైనా 2035 నాటికి 450 కమర్షియల్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
రాయితీలు ఇస్తున్న మోడీ సర్కార్
ఇక ఏడాదికి 600 మంది పైలట్లతో దేశీయ విమానాలు నడిపేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రానున్న ఐదేళ్లలో విమానాశ్రయాల నిర్మాణంకు లక్షకోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం 450 రన్వేలు ఉండగా కేవలం 75 రన్వేలు మాత్రమే పనిచేస్తున్నాయని ఇందుకు కారణం ఆ పాత రన్వేలపై విమానాలను నడిపేందుకు విమానాయాన సంస్థలు సంకోచిస్తున్నాయని తెలుస్తోంది. అయితే మోడీ సర్కార్ 38 విమానాశ్రయాలను అభివృద్ధి చేసి కొన్ని ప్రాంతాలకు టికెట్ ధరలు కూడా తగ్గించింది. అంతేకాదు మరో 63 విమానాశ్రయాలకు తమ విమానాలను తిప్పాల్సిందిగా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది.
సరకు రవాణా కోసం డ్రోన్ల వినియోగం
ఇక మధ్యతరగతి వారికి అందుబాటులో విమాన ప్రయాణం ఉండాలని ఆలోచించిన ప్రభుత్వం సింగపూర్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్లకు స్థానికంగా తమ యూనిట్లను నెలకొల్పుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఇంధనంపై కూడా పన్నులు చాలావరకు తగ్గించింది. ఇక డ్రోన్లను కూడా వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది. 2024 నాటికి చట్టబద్ధంగా వీలైనన్ని ఎక్కువ డ్రోన్లను తిప్పాలని భారత సర్కార్ భావిస్తోంది. 2021 నాటికల్లా డ్రోన్ కారిడార్లను ఏర్పాటు చేసి 2023 కల్లా సరుకులను డ్రోన్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.