రాఫెల్లో అవినీతి? ఎస్క్రో అకౌంట్ నుంచి చెల్లింపులా? పీఎంఓ జోక్యం సరికాదని రక్షణశాఖ కార్యదర్శి
న్యూఢిల్లీ: దేశ రక్షణ అవసరాల కోసం కొనుగోలు చేయదలిచిన రాఫెల్ యుద్ధ విమానాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు వస్తోన్న వార్తలు త్రివిధ దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వస్తోన్న ఆరోపణలు ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి. అవినీతిని అరికట్టడానికి రాఫెల్ ఒప్పందాల్లో తప్పనిసరిగా పాటించి తీరాల్సిన కొన్ని నిబంధనలను కేంద్రం పూర్తిగా ఎత్తేసిందని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది. దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది.
భారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ ఒప్పందాలను కుదుర్చుకునే సమయానికి కేంద్రం.. ఎస్క్రో అకౌంట్ నుంచి కూడా చెల్లింపులు చేయడానికి సిద్ధపడిందనే ఆరోపణలు వచ్చాయని ఈ కథనం వెల్లడించింది. రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఒకవంక- రక్షణ మంత్రిత్వశాఖ అధికారుల బృందం ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తున్న సమయంలో.. దీనికి సమాంతరంగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా అదే ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టడం దీనికి నిదర్శనం.
రక్షణ శాఖ అధికారుల బృందం చర్చలకు సమాంతరంగా ఇతర శాఖలు గానీ, ఆయా శాఖల అధికారులు గానీ, చివరికి ప్రధానమంత్రి కార్యాలయం గానీ సంప్రదింపులు చేపట్టడాన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇలాంటి తప్పే చేసిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ కంపెనీ మన దేశ రక్షణశాఖకు విలువ ఇవ్వలేదనే భావించాల్సి ఉంటుంది.
రాఫెల్ ఒప్పందాలకు సంబంధించిన ప్రతిపాదనల్లో 2016 సెప్టెంబర్ లో అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ ఎనిమిది సవరణలు చేశారని, ఈ సవరణలు రాఫెల్ కొనుగోళ్ల కోసం కేంద్ర మంత్రివర్గ సంఘం సూచించిన సిఫారసులకు విరుద్ధమని తెలింది. రక్షణ శాఖ ప్రతినిధుల బృందానికి సమాంతరంగా ఇతర శాఖలు లేదా, అధికారులు లేదా పీఎంఓ కార్యాలయం చర్చలు జరిపితే.. వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, జరిమానాలకు సంబంధించిన నిబంధన కూడా ఈ ఎనిమిది సవరణల్లో ఒకటి.
అత్యంత కీలకమైన ఈ నిబంధనను స్వయంగా రక్షణశాఖ మంత్రే సవరణలు చేయడం వల్ల అవినీతి చోటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. కొనుగోళ్లు తుది రూపానికి వచ్చిన చివరి నిమిషంలో ఈ తరహా మార్పులు చెప్పుకోదగ్గ సంఖ్యలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందాన్ని కుదుర్చుకున్న డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, ఎంబీడీఎ ఫ్రాన్స్ సంస్థలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఎస్క్రో అకౌంట్ నుంచి చెల్లింపులు చేసిందని, ఇది కూడా భారత్ వైపు నుంచి చోటు చేసుకున్న సవరణల వల్లేనని స్పష్టమౌతోంది.
రాఫెల్ ఒప్పందాల్లో ఎక్కడా అవినీతి చోటు చేసుకోలేదని, పీఎంఓ కార్యాలయం సమాంతర చర్చలు చేపట్ట లేదని, అంతా పారదర్శకంగా జరిగినట్లు రక్షణశాఖ కార్యదర్శి జీ మోహన్ కుమార్ ఇస్తున్న వివరణ సహేతుకంగా ఉండట్లేదు. తమ రక్షణశాఖ ప్రతినిధుల బృందానికి సమాంతరంగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపడం సరి కాదని, దీన్ని నివారించాలని సూచిస్తూ రక్షణమంత్రిని ఉద్దేశించి జీ మోహన్ కుమార్ స్వయంగా ఆయనకు లేఖ రాశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, కొనుగోలు ఒప్పందాల్లో పారదర్శకత లేదనడానికి ఇదీ ఓ ఉదాహరణేనని ఆంగ్ల దినపత్రిక తన కథనాన్ని ప్రచురించింది.