తమిళనాడు ప్రభుత్వం పడిపోతుంది: షాక్ ఇచ్చిన బీజేపీ: ఢిల్లీలో స్పీకర్ కు !
తమిళనాడులో జరిగిన ఐటీ దాడుల్లో కీలక దస్త్రాలు లభ్యమైనాయని, ఆ శాఖ దర్యాప్తు పూర్తి అయితే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సంచలన .
చెన్నై: తమిళనాట ఐటీ అధికారుల దాడులతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఐటీ దాడుల పర్యవసానంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికలు రద్దు అయిన విషయం తెలిసిందే.
ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికలు రద్దు అయిన తరువాత బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ దాడుల్లో కీలక దస్త్రాలు లభ్యమయ్యాయని ఆమె చెప్పారు.
అంతే సంగతులు
ఐటీ శాఖ దర్యాప్తు పూర్తి అయితే తమిళనాడులో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ఇంత అవినీతి జరిగిందా అంటూ ప్రజలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు.
నిప్పులేనిదే పొగ వస్తుందా ?
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షరాలు తమిళిసై సైందరరాజన్ సంచలన వ్యాఖ్యలతో శశికళ వర్గంలోని నాయకులు హడలిపోతున్నారు. నిప్పులేనిదే పొగ వస్తుందా ? అంటు సామెతలు గుర్తు చేసుకుంటున్నారు.
ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందా !
ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం నుంచి తమిళిసై సౌందరరాజన్ కు ఏమైనా క్లూ వచ్చిందా అంటూ ఆరా తీస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వం కూలిపోతే మా కథ కంచికే అంటున్నారు శశికళ వర్గీయులు.
బర్తరఫ్ చేయండి
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో నగదు పంపిణీపై సీబీఐతో విచారణ జరిపించాలని, తమిళనాడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష డీఎంకే నేతలు తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుని ముంబై రాజ్ భవన్ లో కలిసి విన్నవించారు.
గవర్నర్ హామీ ఇచ్చారు
పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత తాను తగిన చర్యలు తీసుకుంటానని తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు హామీ ఇచ్చారని డీఎంకే నేతలు అంటున్నారు. మొత్తం మీద ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తాము పోరాటం చేస్తామని డీఎంకే పార్టీ సీనియర్ నేతలు హెచ్చరించారు.
ఢిల్లీలో అసమ్మతి సెగ
అన్నాడీఎంకే పార్టీపై తిరుగుబాటు చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీ పీఆర్ సుందరం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఢిల్లీలో కలిసి తమిళనాడు మంత్రి విజయభాస్కర్ నగదు పంపిణి విషయంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని మనవి చేశారు.
సీన్ సిడేల్ అంటున్న బీజేపీ, డీఎంకే
తమిళనాడు ప్రభుత్వం కథ కంచికే అంటున్నారు బీజేపీ, డీఎంకే నాయకులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 89 కోట్లు ఆర్ కే నగర్ ఓటర్లకు బట్వాడా చెల్లించారని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారని, ఇక ఈ ప్రభుత్వం కథ క్లోజ్ అంటున్నారు.
క్లూ వస్తేనే తమిళిసై సంచలన వ్యాఖ్యలు
మొత్తం మీద బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆమెకు కొన్ని విషయాలు తెలిసే సంచల వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.