పన్నీరు సంచలన నిర్ణయాలు.. శశికళ షాకింగ్ క్యాంప్ పాలిటిక్స్
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. శశికళను ఎదిరించేందుకే సిద్ధపడిన పన్నీరు.. ఆపద్ధర్మ సీఎంగాను తనదైన మార్క్ చూపిస్తున్నారు. శశికళకు చుక్కలు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
శశికళ ఎఫెక్ట్-చెన్నైకి గవర్నర్.. అందరికీ 'నో' చెప్పారు: 'మీ ఆటలు సాగవు'
చెన్నై నగర పోలీస్ కమిషనర్ను బదిలీ చేయాలని పన్నీర్ సెల్వం ఆదేశించారు. ప్రస్తుతం చెన్నై సిటీ కమిషనర్గా ఉన్న జార్జ్ను తప్పించి సంజయ్ అరోరాకు అప్పగిస్తున్నారు. గురువారం తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పన్నీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెన్నై కమిషనర్ను బదిలీపై పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
శశికళకు వరుస షాక్లు
అలాగే, శశికళ నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ను అమ్మ మెమోరియల్గా మార్చాలని పన్నీరు సెల్వం నిర్ణయించారు. అంతేకాదు, తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించడంపై స్పందిస్తూ.. పార్టీ నిబంధనల మేరకు తానే ట్రెజరర్ను అని, కాబట్టి తన అనుమతి లేకుండా నిధులు వాడడానికి వీలు లేదని బ్యాంకులకు లేఖ రాశారు.
శశికళ క్యాంపు రాజకీయాలు
మరోవైపు శశికళ క్యాంపు రాజకీయాలకు తెరలేపిన విషయం తెలిసిందే. శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని పలు రిసార్టులలో బస చేయించారు. రాతపూర్వకంగా శశికళకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించారు.
ఎమ్మెల్యేలకు సెక్యురిటీ
దాదాపు ఇప్పటి వరకు 90 మంది ఎమ్మెల్యేలు హోటళ్లలో బస చేశారు. సదరు ఎమ్మెల్యేలకు ప్రత్యేక భద్రత కేటాయించారు. ఒక్కే ఎమ్మెల్యేకు ఇద్దరు సెక్యూరిటీని ఉంచారు. ఈ సెక్యూరిటీ కూడా శశికళ బంధువుల కనుసన్నుల్లో పని చేస్తోంది. ఎమ్మెల్యేల ఫోన్లను లాక్కున్నారు.
128 మంది ఎమ్మెల్యేల మద్దతు
అయితే, తమ వెంట 128 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారితో కలిసి గవర్నర్ను కలుస్తామని శశికళ వర్గం చెబుతోంది.
బల నిరూపణకు శశికళ
ఇంకోవైపు బల నిరూపణకు శశికళ వర్గం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు గవర్నర్ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గవర్నర్ ఈ రోజు మధ్యాహ్నం మూడుంపావుకు చెన్నై రానున్నారు. అయిదు గంటలకు అపాయింటుమెంట్ అడుగుతున్నారు.