ఎన్సీపీకి గవర్నర్ డెడ్లైన్: మంగళవారం రాత్రి 8.30గంటల వరకు సమయం, ఆ తర్వాత...
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు క్షణ క్షణానికి మారిపోతుంది. శివసేన తర్వాత గవర్నర్ భగత్సింగ్ ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. కానీ మంగళవారం రాత్రిలోగా గడువు విధించారు. ఆ తర్వాత గవర్నర్ ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నాలుగో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ను పిలుస్తారా ? లేదంటే రాష్ట్రపతి పాలన విధిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డెడ్లైన్..
గవర్నర్ భగత్సింగ్తో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారిని గవర్నర్ కోరారు. అందుకు మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు డెడ్లైన్ విధించారు. ఆ లోపు బలనిరూపణ చేసుకోవాలని కోరారు. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సభ్యుల సంఖ్యతో మొత్తం 98 మందికి చేరుకుంటుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు 47 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.
మోకాలడ్డిన కాంగ్రెస్
శివసేన పిలుపునకు ఎన్సీపీ స్పందించినా.. కాంగ్రెస్ మోకాలడ్డడంతో పరిస్థితి శివసేన చేజారిపోయింది. శివసేనను కాదని ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. అదీ కూడా ఒకరోజు గడువు విధించారు. దీంతో శివసేన మద్దతు తప్పనిసరి.. తమను మోసం చేసినా ఎన్సీపీకి శివసేన స్నేహ హస్తం అందిస్తుందా ? లేదంటే చేయిస్తోందా అనే ప్రశ్న తలెత్తుతుంది.
8.30 గంటల తర్వాత..
మంగళవారం రాత్రి 8.30 గంటల తర్వాత పరిస్థితి ఏంటి అంటే.. గవర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ రానుందున కేంద్రానికి నివేదిస్తారు. అసెంబ్లీ గడువు ముగిసినందున రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేసే అవకాశం ఉంది. గవర్నర్ సిఫారసును బట్టి కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుంది. దీనిని బట్టి వచ్చే రెండు, మూడురోజుల్లో మహారాష్ట్ర రాజకీయాలకు తెరపడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.
బద్ద శత్రువుల ఒక్కటవుతారా..?
ఒకవేళ శివసేన ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో కలిస్తే ప్రభుత్వ ఏర్పాటు నల్లేరు మీద నడకే అవుతుంది. కానీ వైరి పక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాత్రం చరిత్ర సృష్టించడమే అవుతుంది. గత 35 ఏళ్ల నుంచి శివసేన బీజేపీతో కలిసి పోటీచేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి.. తర్వాత కలిసిపోయింది. గత ఎన్నికల్లో కలిసి పోటీచేసినా.. సీఎం పీఠంపై పీటముడి నెలకొనడంతో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు శివసేనను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వైరిపక్షంగానే చూసింది. ఎన్సీపీ కూడా అంటిముట్టనట్టుగానే వ్యవహారించింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ మూడు పార్టీలు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది