మహా ట్వీస్ట్: ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు గవర్నర్ ఆహ్వానం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనను గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానించారు. సోమవారం వరకు బలనిరూపణ చేసుకోవాలని బీజేపీకి సూచించినా.. మద్దతు లేదని ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని బీజేపీ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వ ప్రయత్నాల్లో శివసేన నిమగ్నమైంది.
శివసేన కూటమి..
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 145 మంది సభ్యులు. ఎన్సీపీ 54, శివసేన 56, కాంగ్రెస్ 44 మంది సభ్యులతో 155 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సీఎం బెర్త్..
సీఎం పదవీ కోసం మాత్రం పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు ముఖ్యమంత్రి బెర్త్ ఇస్తామని శివసేన చెబుతోంది. కానీ ఆయన పదవీ చేపట్టేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తొంది. దీంతో ఎవరి పేరు తెరపైకి వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. శివసేన నుంచి ఆదిత్య పేరును పార్టీ ప్రతిపాదిస్తోందనే సంగతి తెలిసిందే.
ఆదిత్యకే..
శివసేన- కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు సీఎం పదవీని పంచుకుంటారా అనే చర్చ జరుగుతుంది. అలా అయితే తొలుత శివసనే నుంచి ఆదిత్య థాకరే సీఎం పదవీ చేపడుతారనే చర్చ జోరుగా జరుగుతుంది. తదుపరి మహారాష్ట్ర సీఎం ఆదిత్య థాకరే అని శివసేన వర్గాల్లో జోరుగా జరుగుతుంది. బాల్ థాక్రే కూడా తమ ఇంటి నుంచి ఒకరు సీఎం పదవీ చేపట్టాలని భావించేవారని ఇటీవల ఉద్దవ్ ప్రస్తావించిన అంశం తెలిసిందే. దీంతో ఆదిత్యను సీఎం చేసేందుకు ఉద్దవ్ బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు తెగించారని ప్రచారం జరుగుతుంది.
ఎన్నాళ్లో మద్దతు...
శివసేనను రాజకీయ ప్రత్యర్థిగా భావించే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వారికి మద్దతు ఇస్తోందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ వారు సపోర్ట్ చేస్తే సీఎం పోస్ట్ ఎవరికీ ఇస్తారనే చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవీపై మాత్రం పీఠముడి నెలకొనే అవకాశం ఉంది. సీఎం పదవీపై కూటమి విచ్చిన్నానికి కూడా దారితీసే అవకాశాలు లేకపోలేదు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో 35 ఏళ్లు కలిసి పనిచేసిన శివసేన.. సీఎం పదవీ కోసమే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది.