జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఎవరు..? వారి నేపథ్యం ఏమిటి..?
రాంచీ: జార్ఖండ్లో ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ను చూస్తే జేఎంఎం- కాంగ్రెస్-ఆర్జేడీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ నేతల కాన్ఫిడెన్స్ చూస్తే మరో మహారాష్ట్ర ఎపిసోడ్ రిపీట్ అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి . బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కార్డ్ను తెరపైకి తీసుకొస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ముందుస్తుగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకునే రంగంలోకి దిగాయి కాబట్టి తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర తర్వాత గవర్నర్ పాత్ర మరోసారి జార్ఖండ్లో కీలకం కానుంది. మరి జార్ఖండ్ గవర్నర్గా ఉన్న ద్రౌపది ముర్ము ఎవరు..? ఆమె నేపథ్యం ఏమిటి..?
జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఒడిషా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన ఉపర్బేడా గ్రామం నుంచి వచ్చారు. ఈమె సంతల్ గిరిజన కుటుంబానికి చెందిన వారు. ఒకప్పుడు రాష్ట్రపతి రేసులో కూడా ఉన్నారు. ఇక 1997లో ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు.
అంతకుముందు ఒక సాధారణ టీచర్గా పనిచేసేవారు. అదే ఏడాది అంటే 1997లోనే బీజేపీ తరపున ఒడిషా షెడ్యూల్డ్ ట్రైబ్ మోర్చా ఉపాధ్యాక్షురాలిగా పనిచేశారు. ఇక నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో అంటే 2000 నుంచి 2004 మధ్య ముర్ము మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆమె రవాణ వాణిజ్య మరియు షిషరీస్ అనిమల్ హస్బెండ్రీ శాఖా మంత్రిగా పనిచేశారు.
2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా ఒడిషా అసెంబ్లీ నుంచి నీలకంఠ అవార్డును అందుకున్నారు ద్రౌపది ముర్ము. 2015లో 59 ఏళ్ల వయస్సులో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు.
ఇక 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారిక బీజేపీ ఒంటరి పోరుకు దిగగా, కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీతో కలిసి బరిలోకి దిగింది. ఇక ఏజేఎస్యూ, జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీలు కూడా ఒంటరిగా పోటీచేశాయి. ఇక ఎన్నికల ఫలితాలు దాదాపుగా కూటమికే అనుకూలంగా ఉండగా గవర్నర్ ద్రౌపది ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.