ఫడ్నవీస్ కు ఈనెల 30 డెడ్ లైన్: బలపరీక్షకు కొత్త వ్యూహాలు: సేన..ఎన్సీపీ చీలికపైనే ఆధారం..!
మహారాష్ట్రలో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న ఫడ్నవీస్ కు గవర్నర్ డెడ్ లైన్ విధించారు. ఈ నెల 30లోగా అసెంబ్లీలో ఫడ్నవీస్ తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ స్పష్టం చేసారు. రాష్ట్రపతి పాలన ఉప సంహరించి...ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే విధంగా వేగంగా బీజేపీ పావులు కదిపింది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్..ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక, ఇప్పుడు సభలో బీజేపీకి 105 మంది..అజిత్ వర్గంలో ఎన్సీపీ నుండి 22 మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..స్వతంత్రుల వైపు బీజేపీ చూస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అగ్ర నేతలు ఎన్సీపీ..శివసేనలో చీలకకు సిద్దంగా ఉన్న నేతల పైన ఫోకస్ పెట్టారు. దీంతో..రానున్న వారం రోజులు మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.
అజిత్ ను బీజేపీ బెదిరించింది: శరద్ పవార్ కు తెలియదు: సంజయ్ రౌత్ ఫైర్..!
ఫడ్నవీస్ కు వారం రోజుల గడువు
అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ కు గవర్నర్ డెడ్ లైన్ విధించారు. వారం రోజుల్లోగా సభలో మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ లోగా సభలో బలం నిరూపించుకోవాలని స్పష్టం చేసారు. అయితే, మహారాష్ట్ర సభలో మొత్తం సభ్యుల సంఖ్య 288. అందులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక, బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎన్సీపీ నుండి మద్దతిస్తున్న అజిత్ పవార్ వర్గానికి 22 మంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక, స్వతంత్ర అభ్యర్దులను సైతం తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది.
అజిత్ వైపు ఎంత మంది ఉన్నారు..
ఎన్సీపీ తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 54 సీట్లు గెలుచుకుంది. అయితే, అజిత్ పవార్ ఆకస్మికంగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి..ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అజిత్ పవార్ ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని..అది పార్టీ నిర్ణయం కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు నిజంగా అజిత్ పవార్ వెనుక ఎంత మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిని తేల్చేందుకే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. దీని ద్వారా తన నాయకత్వంలో పని చేసేందుకు ఎంత మంది సిద్దంగా ఉన్నారు..ప్రచారం జరుగుతున్నట్లుగా 22 మంది ఎమ్మెల్యే మద్దతు అజిత్ పవార్ కు ఉందా అనే విషయం పైన స్పష్టత రానుంది. అజిత్ పవార్ మద్దతు దారుల సంఖ్య పెంచేందుకు బీజేపీ సహకారంలో ఆయన వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అజిత్ తమ పార్టీ నుండి 54 మంది మద్దతు బీజేపీకి ఉందంటూ లేఖ ఇచ్చినట్లుగా కాషాయం నేతలు చెబుతున్నారు.
Recommended Video
శివసేన నుండి బీజేపీకి మద్దతు ఉందా..
క్షణ క్షణానికి మారుతున్న బీజేపీ రాజకీయాల్లో అనూహ్యంగా ఎన్సీపీ మద్దతు సాధించిన బీజేపీ..ఇప్పుడు తమను కాదనుకున్న శివసేనలో సైతం ఇదే ఫార్ములా అనుసరించటానికి సిద్దమైంది. అందులో భాగంగా కాంగ్రెస్..ఎన్సీపీతో శివసేన జత కట్టటం ఇష్టం లేని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే శివసేన నుండి ఎంత మంది టచ్ లో ఉన్నారనే విషయం మాత్రం బీజేపీ బయట పెట్టటం లేదు. అదే సమయంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని తమ పార్టీ నుండి బీజేపీకి మద్దతు లభించదని శివసేన చెబుతోంది. దీంతో..రానున్న వారం రోజుల్లో శివసేనలో సైతం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటానేది ఆసక్తి కరమే.