తేలిపోయిందా?: గవర్నర్ బీజేపీకే అవకాశం ఇస్తున్నారా?, ప్రమాణ స్వీకారంపై యడ్యూరప్ప సంకేతాలు
బెంగళూరు: కన్నడనాట రాజకీయం క్షణక్షణం ఉత్కంఠను రేపుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి 24గంటలు గడిచినా కర్ణాటక 'కింగ్' ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. నిర్ణయం గవర్నర్ చేతుల్లో ఉండటంతో.. ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిని రేకేత్తిస్తోంది. గవర్నర్ వజుభాయ్ వాలాకు గతంలో బీజేపీతో ఉన్న అనుబంధం రీత్యా యడ్యూరప్పకే ఆయన అవకాశం ఇవ్వవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యడ్యూరప్ప ఆయన అనుచరుల కదలికలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి.
రేపు మధ్యాహ్నాం ప్రమాణస్వీకారం?
గవర్నర్ నుంచి ఇంకా ఆహ్వానం అందనే లేదు. కానీ బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప మాత్రం ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలందరికీ వాట్సాప్ సందేశాలు పంపించినట్టు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నాం 12.30గం.కి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేస్తారని అందులో పేర్కొన్నట్టు సమాచారం.
యడ్యూరప్పతో శ్రీరాములు భేటీ
నేటి మధ్యాహ్నాం యడ్యూరప్పతో బీజేపీ డిప్యూటీ సీఎం అభ్యర్థి శ్రీరాములు భేటీ కూడా తెరపై ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. రేపటి ప్రమాణస్వీకార ఏర్పాట్ల గురించి వీరిద్దరు చర్చించుకున్నారని చెబుతున్నారు. గవర్నర్ నిర్ణయం అధికారికంగా వెలువడనప్పటికీ.. ఆయన తమకే అవకాశం ఇస్తారన్న సంకేతాలు వారికి అందినట్టు చెబుతున్నారు.
ప్రత్యర్థి పార్టీలకు గాలం!
బలాబలాల సంఖ్య పక్కనపెడితే.. ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత ఏదో విధంగా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేయవచ్చునని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత.. గవర్నర్ ఇచ్చే గడువు లోపల.. మేజిక్ ఫిగర్ కు కావాల్సిన మిగతా ఎమ్మెల్యేలను ప్రత్యర్థి పార్టీల నుంచి లాగాలని ఆ పార్టీ చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న దానిపై కూడా బీజేపీ నుంచి క్లారిటీ లేకపోవడం గమనార్హం.
యడ్యూరప్పకు అవకాశం ఇస్తే?
ఒకవేళ బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్, జేడీఎస్ లు భావిస్తున్నాయి. అదే సమయంలో తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించి బేరసారాలకు ప్రలోభాలకు దూరంగా ఉంచాలని భావిస్తున్నాయి. ఇందుకోసం బెంగళూరు శివారులోని ఓ రిసార్టులో ఇప్పటికే గదులు బుక్ చేసినట్టుగా కూడా చెబుతున్నారు.