గవర్నర్కే వార్నింగ్ ఇచ్చిన సీఎం: రాజ్భవన్ను ఎవరైనా ముట్టడించ వచ్చు.. బాధ్యత మాది కాదు
జైపూర్: రాజస్థాన్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం రోజురోజుకూ మరింత ముదరురుతోంది. చట్టసభలు, రాజ్యంగం, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణకు దారి తీసే పరిస్థితి తలెత్తుతోంది. న్యాయస్థానాల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితికి చేరుకుంటోంది. చట్టసభ ద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని, ఏర్పడిన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఫలితంగా ఘర్షణాత్మక వైఖరి ఏర్పడింది.
హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో..
రాజస్థాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తిన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ దాఖలు చేసిన పిటీషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి అసహనానికి గురి చేసింది. ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అశోక్ గెహ్లాట్ భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపించాయి. తిరుగుబాటు ఎమ్మెల్యే సచిన్ పైలెట్కు ఊరట ఇచ్చేలా హైకోర్టు స్టేటస్ కోను ఇవ్వడం, ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చడం వంటి పరిణామాల వల్ల తీర్పు వెలువడటంలో మరింత జాప్యం చోటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టయిందని అంటున్నారు.
గవర్నర్తో గెహ్లాట్ భేటీ..
హైకోర్టు నుంచి స్టేటస్ కో ఆదేశాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అనూహ్య అడుగు వేశారు. శాసనసభను సమావేశ పర్చాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో రాజ్భవన్లో భేటీ అయ్యారు. సోమవారం నాడు ప్రత్యేక శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఇతర అంశాలపై చర్చించడానికి శాసనసభను సమావేశ పర్చాలని విజ్ఙప్తి చేశారు. దీనికి గవర్నర్ అంగీకరించలేదని తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశ పర్చలేమని గవర్నర్ సూచించినట్లు సమాచారం.
గవర్నర్పై ఒత్తిళ్లు..
గవర్నర్తో భేటీ అనంతరం అశోక్ గెహ్లాట్ రాజ్భవన్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీని సమావేశ పర్చడానికి గవర్నర్ అంగీకరించట్లేదని అన్నారు. ఈ విషయంలో కొన్ని రాజకీయ శక్తులు ఆయనపై ఒత్తిడిని తీసుకొస్తున్నాయని భారతీయ జనతా పార్టీని ఉద్దేశించిన పరోక్షంగా నిప్పులు చెరిగారు. వాటి ఫలితంగానే-శాసన సభను సమావేశ పర్చేలా గవర్నర్ ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గవర్నర్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తున్నాయని ఆరోపించారు.
Recommended Video
రాజ్భవన్ను ముట్టడిస్తే.. బాధ్యత మాది కాదు..
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి అసెంబ్లీని సమావేశ పర్చడం ఒక్కటే మార్గమని అశోక్ గెహ్లాట్ అన్నారు. కరోనా వైరస్ సహా రాజకీయ పరిస్థితులపై సమీక్షించడానికి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి గల కారణాలను గవర్నర్కు వివరించామని అన్నారు. అయినప్పటికీ.. ఆయన ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు అసహనంతో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్భవన్ను ఎవరైనా ముట్టడిస్తే.. బాధ్యత తమది కాదని అశోక్ గెహ్లాట్ హెచ్చరించారు.