గవర్నర్ సెల్ఫ్ క్వారంటైన్: అనుపమ్ ఖేర్ ఇంట్లో నలుగురికి పాజిటివ్: డ్రీమ్గర్ల్కు కరోనాపై క్లారిటీ
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లక్షలమందికి పైగా కరోనా వైరస్ బారిన పడిన మహారాష్ట్రలో పలువురు ప్రముఖులు కూడా దీని కోరల్లో చిక్కుకుంటున్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. అమితాబ్ భార్య జయా బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్లకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్గా తేలింది. బాలీవుడ్కే చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ కుటుంబ సభ్యుల్లో నలుగురికి కరోనా సోకింది. అనుపమ్ ఖేర్ తల్లి దులారీ, సోదరుడు రాజు, మరదలు రీమా, వారి కుమార్తె వృందా కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలారు.
వారిని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. సీనియర్ నటి, భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యురాలు హేమా మాలినికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని ఆమె కుమార్తె ఈషా డియోల్ తోసిపుచ్చారు. తన తల్లి ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారంటూ ఓ ట్వీట్ చేశారు. తన తల్లికి కరోనా వైరస్ సోకిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఈషాడియోల్ పేర్కొన్నారు. అవన్నీ పుకార్లని తేల్చేశారు. తన తల్లి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారి సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. రాజ్భవన్లో పనిచేస్తోన్న 18 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో గవర్నర్ ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. సెల్ప్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని గవర్నర్ ప్రెస్ సెక్రెటరీ వెల్లడించారు. రాజ్భవన్లో పనిచేస్తోన్న ఉద్యోగులందరికీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. వారిలో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారితమైంది. మరో 57 మందికి చెందిన నివేదికలు అందాల్సి ఉంది. రాజ్భవన్లో పనిచేస్తోన్న ఉద్యోగులు నివసించే ప్రాంతాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అయ్యాయి.
Recommended Video
మహారాష్ట్రలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 10 వేల మార్క్ను దాటింది. శనివారం 223 మంది మరణించారు. దీనితో మృతుల సంఖ్య 10,116కు చేరుకుంది. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్యలో మహారాష్ట్ర టాప్ప్లేస్లో ఉంటోంది. 2 లక్షల 38 వేల మందికి పైగా మహారాష్ట్రీయన్లు కరోనా వైరస్తో ఆసుపత్రుల పాలయ్యారు. మరోవంక- కరోనా వ్యాప్తిని నివారించడానికి సోమవారం నుంచి పుణే జిల్లాలో 10 రోజుల పాటు లాక్డౌన్ను ప్రకటించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో నమోదు అయ్యాయి.