కుమార అసెంబ్లీలో బలం నిరూపించుకో : గవర్నర్ వాజుభాయ్ లేఖ
బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. అసెంబ్లీలో బల నిరూపణ అంశం ఉత్కంఠ రేపింది. అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందేనని బీజేపీ పట్టుబడగా .. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని సమయం కావాలని కాంగ్రెస్ నేతల నినాదాల మధ్య సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కల్పించుకున్నారు. సభలో బలం నిరూపించుకోవాలని సీఎంకు సూచించారు.
కన్నడనాట రాజకీయాలు చిత్ర, విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. గురువారం అసెంబ్లీలో బలనిరూపణ వేదికగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పలుమార్లు సభ వాయిదాపడింది. తర్వాత సభ నడపలేని పరిస్థితి ఉండటంతో శుక్రవారానికి వాయిదావేశారు స్పీకర్ రమేశ్ కుమార్. ఈ క్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా కల్పించుకున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సీఎం కుమారస్వామికి సూచించారు. ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు బలం నిరూపించుకోవాలని కోరారు. అంతకుముందు సభలో బలనిరూపణ చేయాలని స్పీకర్కు కూడా లేఖ రాశారు గవర్నర్. అయితే సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బలనిరూపణ సాధ్యం కాలేదు.
ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ నేత యడ్యూరప్ప సంకీర్ణ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. బలపరీక్షకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉందని .. అదే సంకీర్ణ ప్రభుత్వానికి కేవలం 98 మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు.