బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ, బాలీవుడ్ నటుడు గోవింద
ముంబై: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధానంగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అక్టోబర్ 21న ఎన్నికలు జరుగనుండటంతో శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది.
కాగా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోవింద కూడా పాల్గొన్నారు. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం గమనార్హం.
మహారాష్ట్రలోని బుల్దానాలో మల్కాపూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చైన్సూక్ మదన్లాల్ సన్చేటికి మద్దతుగా గోవింద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ కోరారు.
అంతేగాక, బీజేపీ కండువాను కూడా కప్పుకున్నారు గోవింద. ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ప్రముఖ నటుడు కావడంతో గోవిందాను చూసేందుకు భారీగా అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ గోవింద ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు అక్టోబర్ 21న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 24న ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది ఇలా ఉండగా, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రీపోల్ సర్వేలు వెలువడ్డాయి. ఇక మళ్లీ ముఖ్యమంత్రులుగా ఫడ్నవీస్, మనోహర్లాల్ ఖట్టర్లే ఉంటారని ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐయాన్స్ - సీఓటర్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 మధ్య ఈ సర్వేను నిర్వహించారు. 90 స్థానాలు ఉన్న హర్యానాలో 59.8శాతం మంది ప్రజలు తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.15.8శాతం మంది మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించారు. ఇక అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో చెప్పలేమని 14.2శాతం మంది తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు.
ఇక మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తి అంటూ 40.3శాతం మంది చెప్పారు.19.9శాతం మంది కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హూడాకు ఓటువేశారు. 288 స్థానాలున్న మహారాష్ట్రలో 48.8 శాతం మంది బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా. 10.6శాతం మంది మాత్రం కాంగ్రెస్ వస్తుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక ఎన్సీపీ అధికారంలోకి వస్తుందని 11.3శాతం, బీజేపీ మిత్రపక్షం శివసేన అధికారంలోకి వస్తుందని 9శాతం మంది చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా మెజార్టీ అంటే 34.7 శాతం మంది ఫడ్నవీస్కు ఓటువేశారు. ఉద్ధవ్ థాక్రేకు 5.1శాతం మంది ఓటువేశారు. ఇక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అయితే బాగుంటుందని 5.9శాతం మంది ఓటువేశారు.