ఎట్టకేలకు అనుమతి: కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి సిద్దూ.. పర్మిషన్ ఇచ్చిన కేంద్రం...
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 9న పాకిస్థాన్లో కారిడార్ ప్రారంభోత్సవం ఉంది. సిద్దూకు ఇప్పటికే పాకిస్థాన్ వీసా కూడా మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. చివరికీ పర్మిషన్ ఇచ్చింది.
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు సిద్దూకు విదేశాంగ మంత్రిత్వశాఖకు లేఖరాశారు. తనకు పాకిస్థాన్ నుంచి ఆహ్వానం వచ్చిందని గుర్తుచేశారు. పాకిస్థాన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సిక్కు భక్తునిగా గురు బాబా నానాక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళతానని చెప్పారు. మరోవైపు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా పాకిస్థాన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది.
గతేడాది ఆగస్టులో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సిద్దూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ను కౌగిలించుకున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్యమయ్యాయి. ఈ క్రమంలో సిద్దూ కర్తార్ పూర్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇస్తోందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. కానీ చివరకు కేంద్రం సిద్దూ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సిద్దూ కేంద్రానికి మూడుసార్లు లేఖ రాయడంతో.. కేంద్రం స్పందించి అనుమతి ఇచ్చింది.