అది చైనా భూభాగమా..? ఆ తప్పుడు మ్యాప్ను తొలగించండి... వికీపీడియాకు భారత్ లేఖ...
అక్సాయ్ చిన్ను చైనా భూభాగంగా చూపించే మ్యాప్ను సైట్ నుంచి తొలగించాలని ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియాను భారత్ కోరింది. ఐటీ చట్టం 69ఏ ప్రకారం ఆ మ్యాప్కు పబ్లిక్ యాక్సెస్ను బ్లాక్ చేయాలని కోరింది. ఈమేరకు భారత ఎలక్ట్రానిక్స్&ఐటీ మంత్రిత్వ శాఖ వికీపీడియా సంస్థకు లేఖ రాసింది.
మొదట భారత్కు చెందిన ఓ నెటిజన్ కొద్దిరోజుల క్రితం ఈ వివాదాస్పద మ్యాప్ను వికీపీడియాలో గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇండియా-భూటాన్ రిలేషన్షిప్కి సంబంధించిన వికీ పేజీలో జమ్మూకశ్మీర్ మ్యాప్ను తప్పుగా చూపిస్తున్నారని... వికీపీడియాపై చర్యలు తీసుకోవాలని సదరు నెటిజన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు.
నెటిజన్ తమ దృష్టికి తీసుకొచ్చిన ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను,సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్న ఆ మ్యాప్ను తొలగించాలని నవంబర్ 27న వికీపీడియాకు కేంద్రం లేఖ రాసింది. ఒకవేళ వికీపీడియా ఈ విషయంలో సానుకూలంగా స్పందించకపోతే కేంద్రం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు,అవసరమైతే మొత్తం వికీపీడియా ప్లాట్ఫాంనే భారత్లో బ్లాక్ చేసే అవకాశం లేకపోలేదు.
కాగా,1954లో అప్పటి భారత ప్రధాని నెహ్రూ చైనాతో పంచశీల సూత్ర ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాని ప్రకారం దేశ అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోకూడదు. దేశ ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వం పట్ల పరస్పర అవగాహనతో దురాక్రమణకు పాల్పడకుండా ఉండాలి. కానీ చైనా ఈ నిబంధనకు తూట్లు పొడుస్తూనే ఉంది. 1950లలోనే చైనా జింజియాంగ్ నుంచి పశ్చిమ టిబెట్ దాకా 1,200 కి.మీ. రోడ్డు నిర్మించింది. అందులో 179 కి.మీ. రోడ్డు భారత్ భూభాగమైన ఆక్సాయ్ చిన్ గుండా నిర్మించింది. చాలా ఏళ్లకు గానీ భారత్ ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. 1962లో భారత్-చైనా మధ్య యుద్దం కూడా జరిగింది. అయినప్పటికీ సరిహద్దు వివాదంపై చైనా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ సందర్భం వచ్చిన ప్రతీసారి ఆక్సాయ్ చిన్ను తమ భూభాగమని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.