43 చైనా యాప్స్ బ్యాన్.. 200కి చేరిన మొత్తం అప్లికేషన్ల సంఖ్య.. నిషేధం ఎందుకంటే..?
డ్రాగన్ చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 43 యాప్స్ బ్యాన్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకే వందకు పైగా చైనా యాప్స్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి బ్యాన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొద్దిరోజులుగా లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది.
బ్యాన్ చేసిన యాప్స్లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లు ఉన్నాయి. భారత సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగే అవకాశం ఉంది అని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. రక్షణరంగ, ప్రజల భద్రత దృష్ట్యా అప్లికేషన్లను బ్యాన్ చేశామని వెల్లడించింది.
ఇప్పటికే చైనాకు చెందిన వందకు పైగా యాప్స్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్ వంటి 59 యాప్స్పై కేంద్ర బ్యాన్ విధించింది. ఆ తరువాత రెండో విడతగా పాపులర్ గేమ్ పబ్జీతో సహా మొత్తం 118 యాప్స్ను బ్యాన్ చేసింది. ఇక ఇప్పుడు అలీ ఎక్స్ప్రెస్తోపాటు 43 యాప్స్ను బ్యాన్ చేయడంతో మొత్తం ఇండియా బ్యాన్ చేసిన చైనీస్ అప్లికేషన్ల సంఖ్య 200 దాటింది.