దేశంలో ఎంతమంది విద్యార్థులకు డిజిటల్ యాక్సెస్... కేంద్ర విద్యాశాఖ డేటా ఇదే...
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా విద్యారంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా ప్రపంచమంతా ఆన్లైన్ విద్యా బోధననే ఎక్కువగా అనుసరిస్తున్నది. అయితే పాఠశాల విద్యకు సంబంధించి భారత్ లాంటి దేశాల్లో స్పష్టమైన డిజిటల్ విభజన కనిపిస్తోంది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ ఫోన్లు లేదా స్మార్ట్ టీవీలు తప్పనిసరి. అయితే ఇవేవీ లేని విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇలా డిజిటల్ యాక్సెస్ లేని విద్యార్థుల డేటాను కేంద్రం ఇప్పుడిప్పుడే సేకరిస్తోంది.
పాఠశాల విద్యార్థుల డిజిటల్ యాక్సెస్కి సంబంధించి తాజాగా కేంద్ర విద్యాశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ప్రకారం... ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 1.4కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు డిజిటల్ యాక్సెస్ లేదు. జార్ఖండ్,కర్ణాటకల్లో ఈ సంఖ్య 30లక్షలు చొప్పున ఉంది. కేరళ,రాజస్తాన్ రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది.అక్కడ దాదాపుగా అందరు విద్యార్థులకు డిజిటల్ యాక్సెస్ ఉంది.
మధ్యప్రదేశ్లో 70 శాతం పాఠశాల విద్యార్థులకు డిజిటల్ యాక్సెస్ లేదు. మహారాష్ట్రలో 60శాతం,గుజరాత్లో 40 శాతం విద్యార్థులకు డిజిటల్ యాక్సెస్ లేదు. తాజా నివేదికలో పశ్చిమ బెంగాల్,ఉత్తరప్రదేశ్,ఢిల్లీ,ఈశాన్య రాష్ట్రాలు సహా తదితర రాష్ట్రాలకు సంబంధించిన డేటాను ఇంకా చేర్చలేదు. ఆయా రాష్ట్రాలు ఇంకా డేటాను సమర్పించలేదని విద్యాశాఖ చెబుతోంది. అన్ని రాష్ట్రాల నుంచి సమగ్రమైన డేటా అందుబాటులోకి వస్తే డిజిటల్ యాక్సెస్ విషయంలో దేశంలో నెలకొన్న పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ... దేశంలో డిజిటల్ విభజన సమస్యను పరిష్కరించే అంశంపై దృష్టి సారించామన్నారు. ఇందుకోసం వన్ క్లాస్,వన్ ఛానెల్,కమ్యూనిటీ రేడియో వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో జులై నుంచి స్కూళ్ల రీఓపెనింగ్కి బిహార్,తెలంగాణ,మహారాష్ట్రలు సిద్దమవుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఒకవేళ థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తే మళ్లీ ఆన్లైన్ క్లాసుల పైనే ఆధారపడాల్సి వస్తుంది. అదే జరిగితే దేశంలోని విద్యార్థులందరికీ డిజిటల్ యాక్సెస్ తప్పనిసరి. లేనిపక్షంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డిజిటల్ గ్యాప్ లేకుండా చేయాలంటే సమగ్ర డేటాతో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల నుంచి డిజిటల్ యాక్సెస్ డేటాను కేంద్రం సేకరిస్తోంది.