పౌరసత్వ సవరణ బిల్లు: విమర్శలు.. సమాధానాలు..ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ ఇదే..!
Recommended Video
న్యూఢిల్లీ: లోక్సభలో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎన్నో అనుమానాలు, అంతకుమించి మరెన్నో వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. అయితే వీటన్నిటిని ఖాతరు చేయని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బిల్లును రాజ్యసభలో పాస్ చేయించి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే విపక్షాలతో పాటు చాలామంది సంధిస్తున్న విమర్శలకు ప్రభుత్వం 8 పాయింట్లతో సమాధానం ఇచ్చింది.
వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు
వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు ధ్వజమెత్తాయి. మరికొన్ని బీజేపీ మిత్ర పక్షాలే బిల్లుపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. విపక్షాలు కట్టుకథలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెబుతూ వారు చేస్తున్న అసత్యమైన ఆరోపణలకు వివరణ ఇచ్చింది కేంద్రం.
A) అవాస్తవం: పౌరసత్వ సవరణ బిల్లు కేవలం బెంగాల్కు చెందిన హిందువులకు మాత్రమే వర్తిస్తుంది
* ప్రభుత్వం వివరణ: బెంగాల్లో నివసిస్తున్న హిందువులకు మాత్రమే భారత పౌరసత్వం లభించదు. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి భారత్లో స్థిరపడ్డ ముస్లింయేతర ప్రజలకు కూడా పౌరసత్వం వర్తిస్తుంది. ఇదే మానవీయ కోణంలోనే ప్రతిపాదించడం జరిగింది. ముస్లిం మెజార్టీ దేశంలో మైనార్టీలుగా ఉన్న ఇతర మతం వారిపై వివక్ష చూపుతుండటంతో భారత్ వారికి పౌరసత్వం ఇవ్వడం జరుగుతోంది.
B) అవాస్తవం: అస్సామ్ ఒప్పందంను పౌరసత్వ సవరణ బిల్లు నీరుగారుస్తోంది
* వాస్తవం: అస్సాం ఒప్పందం ఎట్టిపరిస్థితుల్లో రద్దు కాదు. మార్చి 24, 1971 వరకు భారత్లో స్థిరపడ్డ అక్రమవలస దారులను గుర్తించడం తిరిగి తమ దేశానికి పంపడం జరుగుతుంది. దీనివల్ల అస్సాం ఒప్పందంకు ఎలాంటి హాని చేకూరదు.
విమర్శలకు క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
C)అవాస్తవం: అస్సాంలో ఉన్న ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పౌరసత్వ సవరణ బిల్లు ఉంది
* వాస్తవం: అస్సాం కేంద్రంగా పౌరసత్వ సవరణ బిల్లు రూపొందించబడలేదు. ఈ బిల్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. అంతేకాదు ఎన్ఆర్సీతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఎలాంటి సంబంధం లేదు.
D) అవాస్తవం: పౌరసత్వసవరణ బిల్లుతో బెంగాలీ మాట్లాడే వారి ఆధిపత్యం ఎక్కువ అవుతుంది
* వాస్తవం: అస్సాంలోని బరాక్ వ్యాలీలో ఎక్కువగా బెంగాలీ మాట్లాడే వారు స్థిరపడ్డారు.అక్కడ బెంగాలీ భాషను రెండో అధికారిక భాషగా ప్రకటించడం జరిగింది. ఇక బ్రహ్మపుత్ర వ్యాలీలో అక్కడక్కడ స్థిరపడ్డ హిందు బెంగాలీలు అస్సాం భాషకు అలవాటు పడ్డారు.
అనుమానాలు పెట్టుకోరాదన్న ప్రభుత్వం
E) అవాస్తవం: అస్సాంకు బెంగాలీ హిందువులు భారంగా మారుతారు
* వాస్తవం: పౌరసత్వ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షకు గురైన వారు భారత్కు వచ్చి చాలా రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. ఒక్క అస్సాంలోనే స్థిరపడలేదు
F) అవాస్తవం: పౌరసత్వ సవరణ బిల్లుతో బంగ్లాదేశ్ నుంచి మరింత మంది హిందువులు వలస వచ్చే అవకాశం ఉంది
* వాస్తవం: ఇప్పటికే బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న చాలామంది హిందువులు భారత్కు వచ్చేశారు. ఇక పెద్ద ఎత్తున హిందువులు ఇప్పుడు భారత్కు రావడం అసాధ్యం. అంతేకాదు డిసెంబర్ 31, 2014లోపు వచ్చిన వారికే భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ కటాఫ్ తేదీ తర్వాత వచ్చిన వారికి పౌరసత్వంతో పాటు ఇతర లబ్ధిలు ఏవి కలగవు
ప్రజలను తప్పుదోవ పట్టించొద్దన్న కేంద్రం
G) అవాస్తవం: గిరిజనుల భూమిని బెంగాలీ హిందువులకు కట్టబెట్టేందుకు పౌరసత్వ సవరణ బిల్లుతో కుట్ర జరుగుతోంది
* వాస్తవం: బెంగాలీ హిందువులు ఎక్కువగా బరాక్ వ్యాలీలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతం గిరిజనుల బెల్ట్కు చాలా దూరంలో ఉంది. అంతేకాదు గిరిజనుల భూమిని పరిరక్షించేందుకు ఉన్న చట్టంకు పౌరసత్వ సవరణ బిల్లుకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఉన్న ప్రొవిజన్ వల్ల ఇక్కడ పౌరసత్వ సవరణ బిల్లు అమలు కాదు.
H) పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చూపుతోంది
* వాస్తవం: ఏ విదేశీయుడైనా, ఏ మతానికి చెందినవారైనా సరే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 1955 పౌరసత్వ చట్టంకు అనుగుణంగా ఉండాలి. ఈ ప్రొవిజన్లను పౌరసత్వ సవరణ బిల్లులో మార్పు చేయలేదు. ఇది కేవలం పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లింయేతర ప్రజలకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించేలా సవరణ చేయడం జరిగింది. అది కూడా అన్ని డాక్యుమెంట్లు ఉంటేనే భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది.
ఇలా విపక్షాలతో పాటు ఇతర మేధావుల నుంచి ఎదురైన విమర్శలకు 8 పాయింట్ల ద్వారా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.