ఆన్లైన్ అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఫ్లిప్కార్ట్ సేల్స్ బిగిన్.. అమెజాన్ సంగతేంటి..?
న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిన నేపథ్యంలో ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూసింది. అయితే ఈ నష్టాల నుంచి కొంతలో కొంతైనా గట్టెక్కాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ నుంచి కొన్నిటికి ఉపశమనం కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వేటికి రిలీఫ్ ఇస్తుందో ప్రకటించింది. అయితే తాజాగా భారీ ఉపశమనం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 తర్వాత ఆన్లైన్ ద్వారా నిత్యావసర వస్తువులే కాకుండా ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఊపందుకోనున్న ఆన్లైన్ అమ్మకాలు
ప్రస్తుతానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి ఈ-కామర్స్ వెబ్సైట్లు నిత్యావసర సరుకులను మాత్రమే తమ వెబ్సైట్లపై ఉంచి అమ్మకానికి పెట్టాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసరేతర వస్తువులకు కూడా పచ్చజెండా ఊపడంతో ఇక కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఈ-కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. డిజిటల్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు దేశ వృద్ధిలో డిజిటల్ ఎకానమి ముఖ్య భూమిక పోషిస్తోందని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ-కామర్స్ ఆపరేషన్స్, ఐటీ ఆపరేషన్స్, ఐటీ-ఎనేబుల్డ్ సర్వీసెస్, ప్రభుత్వ కార్యకలాపాల కోసం డేటా మరియు కాల్సెంటర్లు, ఆన్లైన్ పాఠాలను అనుమతిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏప్రిల్ 20 తర్వాతే...
ఇక ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ-కామర్స్కు చెందిన వాహనాలు రోడ్లు ఎక్కొచ్చని అయితే తప్పని సరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించింది. లాక్డౌన్ పూర్తిగా ఉన్న సమయంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసేందుకు వీలు ఉండేది కాదు. కానీ ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ-కామర్స్ వెబ్సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు వీటిని కూడా విక్రయించొచ్చని ఆదేశాల్లో పేర్కొంది. అంటే మీరు కొత్త ఫోను కానీ టీవీ కానీ ల్యాప్టాప్కానీ ఆర్డర్ చేస్తే మీకు డోర్ డెలివరీ అవుతుందన్నమాట.
ఫ్లిప్కార్ట్ ఓకే.. బట్ అమెజాన్..?
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఫ్లిప్కార్ట్ ఏప్రిల్ 20నుంచి అన్ని ఆర్డర్లను స్వీకరిస్తుందని స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. మరోవైపు అమెజాన్ మాత్రం ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తోంది. ఈ-కామర్స్ సంస్థలకు అనుమతివ్వడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ.. వస్తువులను డెలివరీ చేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారా లేదా అనేది కీలకంగా మారిందని అమెజాన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అంతేకాదు వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరిగి ఇళ్లకు చేరుకుంటారా అనే ఆందోళన సైతం వ్యక్తం చేశారు.