ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం -4తప్ప మిగతావన్నీ ప్రైవేటుకే: ప్రధాని మోదీ సంచలనం -పూర్తి వివరాలివే
చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయనో, వారసత్వంగా వస్తున్నాయన్న కారణంగానో ప్రభుత్వరంగ సంస్థలను (పీఎస్యూ) నడపలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నష్టదాయక పీఎస్యూలు దేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారాయని, కేవలం పన్నుచెల్లింపుదారులు(ట్యాక్స్ పేయర్ల) మద్దతుతోనే నడుస్తోన్న ఆ సంస్థలు.. పన్నులు చెల్లించలేని పేదలు, నిరుద్యోగ యువకుల పాలిట భారంగానూ ఉన్నాయని చెప్పారు.
నా పేరే ఒక బ్రాండ్ -బెజవాడలో అసలైన సింహాన్ని -వెల్లంపల్లి ఒంటినిండా మచ్చలే -జగన్ కబోది: జలీల్ ఖాన్
ప్రధాని సంచలన ప్రసంగం..
నిజంగా ప్రజల అవసరాలను తీరచేవి, దేశ వ్యూహాత్మక విధానాలకు పనికొచ్చేవి తప్ప దాదాపు అన్ని ప్రభుత్వం రంగ సంస్థలూ భారంగా మారిన నేపథ్యంలో ఆ బరువును దించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఇతవరకూ ఎవరూ చేయలేని సాహసాన్ని తాము చేపట్టామని, వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (దీపమ్)(పెట్టుబడుల ఉపసంహరణ శాఖ) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై బుధవారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని ఈ మేరకు సంచలన ప్రసంగతం చేశారు. మోదీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...
కాలం మారింది.. మనమూ మారాలి..
''ఈసారి బడ్జెట్ కంటే ముందే పలు రంగాల వ్యక్తులతో విస్తృతంగ చర్చించాం. ఈ ఏడాది బడ్జెట్ ద్వారా భారత్ ను మళ్లీ అభివృద్ది పట్టాలు ఎక్కించేలా స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాం. దేశ వికాసానికి ప్రైవేటు రంగం అవసరాన్ని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఆవశ్యకతను, టార్గెట్లను బడ్జెట్ లో విపులంగా పేర్కొన్నాం. పెట్టుబడుల ఉపసంహరణ, సంపద సృష్టికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థల్ని నెలకొల్పినప్పుడు పరిస్థితులు, అప్పటి అవసరాలు వేరుగా ఉన్నాయి. 50, 60 ఏళ్ల కిందటి విధానాలు ఈ కాలానాకి పనికిరావు. కాబట్టే మేం భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టాం. ప్రజల డబ్బులు సరైన పద్ధతిలో ఉపయోగపడాలన్నదే మా ప్రధాన ధ్యేయం.
పీఎస్యూలు ఆర్థిక గుదిబండలు
చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే పన్ను చెల్లింపుదారుల(ట్యాక్స్ పేయర్ల) మద్దతుతోనే అవి మనగలుగుతున్నాయి. మరి పన్నులు చెల్లించలేని పేదలు, నిరుద్యోగ యువత సంగతేంటి? పన్ను చెల్లింపుదారుల నుంచి వస్తోన్న డబ్బును ఇలా నష్టాల్లో ఉన్న సంస్థలకు మళ్లిస్తే.. పేదలు, యువతకు ఎలా న్యాయం చేగలం? ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు.. ఆర్థిక వ్యవస్థకూ గుదిబండలా మారాయి. ఇన్నేళ్లుగా కొనసాగుతున్నాయి కదా అనే అర్థంలేని మాట కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలని అనడం పొరపాటే. వాటిలో కొన్ని కొందరి పొట్టలు నింపే ప్రాజెక్టులుగానూ ఉన్నాయిమరి. నిజంగా పీఎస్యూలు ప్రజల ప్రత్యేకమైన అవసరాలను తీర్చేవిగా, దేశ వికాసానికి వ్యూహాత్మక సంస్థలుగా ఉన్నట్లయితే వాటి ఆవశ్యకతను నేను అర్థం చేసుకోగలను. అందుకే, నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తాం. ఎందుకంటే..
వ్యాపారం ప్రభుత్వ విధానం కాదు
ప్రభుత్వ విధానం ముమ్మాటికీ వ్యాపార, వాణిజ్యాలను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప.. ప్రభుత్వమే వ్యాపార సంస్థగా ఉండటానికి వీల్లేదు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే వ్యాపారం చేయాల్సిన లేదా ప్రభుత్వరంగ సంస్థలను నడిపించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతమాత్రమూ లేదు. అది అసంభవం కూడా. ఈ సందర్భంగా నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను.. Govt has no business to be in business. ప్రభుత్వ ఫోకస్ మొత్తం ప్రజల అభివృద్ధి, సంక్షేమాలపైనే ఉండాలే తప్ప వ్యాపార రంగంపై కాదు. ప్రభుత్వ శక్తియుక్తులు, యంత్రాంగం అంతా ప్రజాకల్యాణం కోసమే పాటుపడాలి. అంతేగానీ, ప్రభుత్వం బిజినెస్ చేస్తే నష్టాలు చవి చూడక తప్పదు. నిజానికి..
గత పాలకులు భయపడ్డారు..
ప్రభుత్వం వ్యాపారాలను నిర్వహించడానికి సముచిత నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోలేదు. అలా చేయడానికి మళ్లీ ప్రభుత్వ నిబంధనలే అడ్డుగా నిలుస్తాయి. ప్రతి ఒక్కరినీ కనిపెట్టుకుని ఉండే ప్రభుత్వాలు.. వ్యాపారపరంగా కమర్షియల్ నిర్ణయాలను ధైర్యంగా తీసుకోలేవు. ఒకవేళ తీసుకున్నా.. కోర్టుల్లో చిక్కులు చిక్కులు ఎదురవుతాయేమో అని భయం ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే, ప్రభుత్వ రంగ సంస్థలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికి ఎవరూ సాహసించరు. నా పదవీ కాలం చిన్నది కాబట్టి, ఇదంతా ఎందుకొచ్చిన గొడవ, తర్వాత వచ్చేవాళ్లు చూసుకుంటారులే అనుకుంటారు. ఇదిగో.. ఇలాంటి ఆలోచనా విధానంతో వ్యాపారంలో రాణించలేం. మరో కోణం ఏంటంటే..
సర్కారు యంత్రాంగం పని వేరే..
ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటే.. దాని పరిధి, విస్తృతి కుచించుకుపోతాయి. ప్రభుత్వం దగ్గర సమర్థవంతమైన అధికారులకు కొదువ లేదు. కానీ.. వాళ్లకు ఇచ్చిన శిక్షిణ అంతా.. పాలనా వ్యవస్థను, విధి విధానాలను అమలు చేయడానికి, అదే సమయంలో ప్రజల బాగోగులను చూడటానికి మాత్రమే అనే విషయాన్ని మనమంతా గుర్తించాలి. సర్వీసు మొత్తం ఇలాంటి పనులు చేసినవాళ్లతో ప్రభుత్వం వ్యాపారం చేయడం(ప్రభుత్వరంగ సంస్థలను నడపడం) కుదిరేపని కాదు. ఇది ఒకరకంగా అధికారుల ట్యాలెంట్ తో ఆడుకున్నట్లేకాదు.. సదరు ప్రభుత్వ రంగ సంస్థను కూడా నాశనం చేసినట్లువుతుంది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్లుతున్నాం. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుంది. ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్యుత్తమ విధానాలను తెస్తుంది. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథంలోకి వెళుతుంది. ఆ మేరకు అనువైన బాటను ఈ ఏడాది బడ్జెట్ లో పొందుపర్చాం'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
లైవ్ డిబేట్లో విష్ణుపై చెప్పుతో దాడి -అమరావతి జేఏసీ నేతపై ఛానల్ ఆగ్రహం -కులం కోణం -బీజేపీvsటీడీపీ