మానవత్వం మంటగలిసింది : మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ నో, భుజాలపై మోసుకెళ్లిన తండ్రి
పాట్నా : నిర్లక్ష్యం అంటే చిన్నదవుతుందే ఏమో .. అజాగ్రత్త, ఏమరుపాటు, లెక్కలేని తనం కూడా సరిపోవేమో. ఇప్పటికే హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మాత్రం మార్పులేదు. ఛేంజ్ కాదు చలనం లేదు. బీహర్లో గుండె తరుక్కుపోయే ఘటన జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అక్కడి సిబ్బంది మాత్రం .. అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మరింత కుంగిపోయాడు ఆ తండ్రి.
విషాద ఘటన ..
పక్క ఫోటోలో కనిపిస్తోన్న వ్యక్తి ఒక కొడుకును మోసుకెళ్తున్నాడు. కానీ అతడు విగతజీవి. తన కుమారుడిని పార్థీవదేహన్ని దింపేందుకు సర్కారీ అంబులెన్స్ నిరాకరించడంతో చేసేదేమీ లేక పేగు తెంచుకొని పుట్టిన కుమారుడిని భుజం పైకి వేసుకొని వచ్చాడు. అయితే పక్కన వెళ్తున్న వారు కూడా స్పందించకపోవడం ఆందోళన కలిగించింది.
నో అంబులెన్స్ ...
తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు. కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో నలందలోని సదర్ సర్కార్ దవాఖానలో చేర్చారు. చికిత్స పొందుతూనే ఆ బాలుడు ఇవాళ చనిపోయాడు. దీంతో ఆ తండ్రి గుండె పగిలింది. తన కుమారుడు చనపోయాడనే బాధ ఓ వైపు ఉంటే .. ఆస్పత్రి సిబ్బంది వైఖరి మరింత ఆందోళన కలిగించింది. మృతదేహం ఇంటి వద్ద దింపాలని కోరితే .. తమ వద్ద అంబులెన్స్ అందుబాటులో లేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఏం చెప్పాల్లో ఆ తండ్రికి తెలియలేదు. అయితే మరో వాహనంలో తీసుకెళ్లడానికి అతని వద్ద డబ్బులు లేవు. దీంతో ఏం చేయాలో తోచలేదు. చేసేదేమీ లేక తన భుజాలపై కుమారుడు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. అయితే పక్కనున్న వారు ఫోటోలు తీశారే తప్ప .. సాయం చేస్తామని ముందుకురాకపోవడం కలచివేసింది.
చర్యలు తప్పవు ....
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ యోగేంద్ర సింగ్ దృష్టికొచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన హామీనిచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేస్తే వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. ఇప్పటికే బీహర్లో మెదడు వాపు వ్యాధి సోకి 140 పైచిలుకు చిన్నారులు చనిపోయారు. దీంతో ఇతర పిల్లలు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నలందలో బాలుడి మృతి కలచివేస్తోంది. పైగా అంబులెన్స్ ఇవ్వకపోవడం దుమారం రేపింది.