భారీగా పడిపోయిన బియ్యం ఎగుమతులు...ప్రభుత్వమే కారణమా..?
న్యూఢిల్లీ: దేశంలోని బియ్యం వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ఎగుమతి పడిపోయింది. ఇందుకు కారణం ఆఫ్రికన్ దేశాల నుంచి బియ్యంకు సప్లైకు డిమాండ్ తగ్గడం ఒక కారణమైతే... భారత ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిపివేయడం మరో కారణం అని రైస్ ఇండస్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక మన ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇవ్వకుంటే భారత్ తర్వాతి స్థానంలో ఉన్న వియత్నాం, మయన్మార్లు పుంజుకుంటాయని చెబుతున్నారు.
ఆఫ్రికా దేశాల నుంచి భారత బియ్యంకు తగ్గిన డిమాండ్
ఇప్పటికే ఆఫ్రికాలాంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు పలుదేశాలు క్యూకట్టాయని ఓలాం ఇండియా రైస్ బిజినెస్ ఉపాధ్యక్షుడు నితిన్ గుప్తా తెలిపారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే బియ్యంకు అధిక డిమాండ్ ఉండగా ఇప్పుడు ఆ డిమాండ్ ఇతర దేశాలవైపు మరులుతోందని చెప్పారు. ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే భారత్ 10 నుంచి 11 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు నితిన్ గుప్తా తెలిపారు. బాస్మతి బియ్యం కాకుండా సాధారణ బియ్యం ఎగుమతిపై ప్రభుత్వం నాలుగు నెలల పాటు ప్రోత్సహకాలు ఇచ్చినప్పటికీ 2018 -19 ఆర్థిక సంవత్సరానికి గాను 11.95 మిలియన్ టన్నులు మాత్రమే ఎగుమతి చేయడం జరిగింది. అంటే దీనికి ముందు 12 నెలల కంటే 7.2 శాతం తక్కువగా ఎగుమతి చేయడం జరిగింది.
బియ్యం ఎగుమతులకు ప్రోత్సాహకాలు నిలిపివేసిన ప్రభుత్వం
భారత్ నుంచి బాస్మతి బియ్యం కాకుండా సాధారణ బియ్యం బంగ్లాదేశ్, నేపాల్, బెనిన్, సెనెగల్లకు ఎగుమతి చేస్తుండగా ఇరాన్, సౌదీ అరేబియా ఇరాక్ దేశాలకు ప్రీమియర్ క్వాలిటీ బాస్మతి బియ్యంను ఎగుమతి చేస్తోంది. ఇక బాస్మతి బియ్యం ఎగుమతుల్లో భారత్కు పోటీగా పాకిస్తాన్ ఉండగా సాధారణ బియ్యం ఎగుమతిలో థాయ్ల్యాండ్, వియత్నాం, మయన్మార్ దేశాలున్నాయి. బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం ప్రోత్సహాకాలు ఇవ్వడం ఈ ఏడాది మార్చి 25న నిలిపివేసిందని వెంటనే పునరుద్ధరించకుంటే ఈ ఏడాది బియ్యం ఎగుమతులు దారుణంగా పడిపోతాయని చెప్పారు రైస్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు.
చైనాకు పెరిగిన డిమాండ్..భారత్పై దెబ్బ
ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో బియ్యం ఎగుమతి దాదాపు 30 శాతం పడిపోయిందని అదే సాధారణ బియ్యం ఎగుమతి 50శాతంకు పడిపోయిందని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వియత్నాం, మయన్మార్లు ఎగుమతి సందర్భంగా భారత్ ఇచ్చే ప్రోత్సాహకాలకంటే ఒక టన్ను బియ్యంకు 30 డాలర్లు తక్కువకే ఇస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక చైనాలో పాత బియ్యం స్టాకు విరివిగా ఉన్నందున అది భారత్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా దేశాలకు చైనా పెద్ద ఎత్తున పాత బియ్యంను ఎగుమతి చేస్తోంది. దీంతో భారత్ ఎగుమతులు చాలా వరకు పడిపోయాయి.