ఎన్ఆర్ఐ భర్తల బాధితుల కోసం త్వరలో వెబ్ పోర్టల్
ఎన్నారై భర్తల చేతిలో మోసపోయిన బాధిత భార్యలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ లో అడ్వకేట్లు, స్వచ్ఛంద సంస్థలు తదితర సమాచారం ఉంటుంది.
న్యూఢిల్లీ: ఎన్నారై భర్తల చేతిలో మోసపోయిన బాధిత భార్యలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ లో అడ్వకేట్లు, స్వచ్ఛంద సంస్థలు తదితర సమాచారం ఉంటుంది. ఈ పోర్టల్ ను భారత విదేశాంగ శాఖ నిర్వహించనుంది.
గత వారం జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో ఈ మేరకు ఒక వెబ్ పోర్టల్ ను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కమిటీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కరేసి చొప్పున అధికారులున్నారు.
విదేశాల్లో భర్త వదిలేసినా, స్వదేశంలో మోసానికి గురై విడాకులు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, మనోవర్తి పొందాలనుకునే బాధిత మహిళలకు కేంద్రం తీసుకురానున్న ఈ వెబ్ పోర్టల్ సహాయకారిగా ఉంటుంది.
ఎన్నారై భర్తల గురించి పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత ఏడాది ఏర్పాటైన ఈ కమిటీ.. బాధితులకు అభివృద్ధి చెందిన దేశాల్లో 3 వేల డాలర్లు, వర్థమాన దేశాల్లో 2 వేల డాలర్లు ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.