గత ఐదేళ్లలో ఇదే అత్యల్పం?: పీఎఫ్ పై వడ్డీరేటు ఎంతో తెలుసా!
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్)పై వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును 8.55శాతంగా నిర్ఱయించారు. దీనికి సంబంధించిన ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల నియమావళి రీత్యా ఇప్పుడే దీని ప్రకటించే అవకాశం లేదు. ఎన్నికల సంఘం అనుమతి రాగానే, కేంద్ర కార్మికశాఖ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. దీంతో పీఎఫ్ ఖాతాలు కలిగిన 5కోట్ల మంది చందాదారులకు ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఈవారంలోనే పూర్తి చేయనున్నట్టు సమాచారం.
కాగా, గత ఐదేళ్లలో పీఎఫ్ పై అమలుచేసిన వడ్డీ రేట్లలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. 2015-16లో 8.88శాతంగా ఉన్న వడ్డీరేటు, 2016-17లో 8.65శాతానికి, 2017-18లో 8.55శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నిర్ణయించిన వడ్డీరేటును కూడా మరింత తగ్గించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. చివరాఖరికి ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికే కేంద్ర ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది.