మోడీ సర్కార్కు ఉన్నతాధికారి షాక్.. రాజీనామా ఆమోదించండి.. లేదా తొలగించండి
జమ్ముకశ్మీర్ విభజన జరిగి ఆరునెలలవుతోన్నా నిరసనలు మాత్రం తగ్గడం లేదు. రాజకీయ నేతలు నిర్భందంలోనే ఉన్నారు. జమ్ముకశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ, ఆర్టికల్ 370 రద్దును విభేదిస్తూ యువ ఐఏఎస్ అధికారి కన్నాన్ గోపినాథన్ తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తనను విధుల నుంచి డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
డిస్మిస్ చేయండి..
ఆర్టికల్ 370 రద్దు చేసి, కశ్మీర్లో ఆంక్షలు విధించిన తర్వాత కన్నాన్ గోపినాథన్ తన ఐఏఎస్ పదవీకి రాజీనామా చేశారు. ఆరునెలల నుంచి రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నాన్చుతూనే ఉంది. దీంతో కన్నాన్ స్పందిస్తూ.. రాజీనామా ఆమోదించకుంటే సర్వీస్ నుంచి తొలగించాలని కోరారు. కానీ తాను మాత్రం కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ఆగస్ట్లో తన పదవీకి రాజీనామా చేసిన తర్వాత కశ్మీర్ ప్రజలను కలుసుకొని.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదమని..
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్, జాతీయ పౌర పట్టికపై అక్కడి ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. సీఏఏ; ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ఎంత ప్రమాదమో ప్రజలు క్రమంగా గ్రహిస్తున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రజలు పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. అవును ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తాము ఎంత ప్రమాదంలో ఉన్నామనే విషయం వారికి స్పష్టమవుతోందన్నారు. కానీ వారి నుంచి భయం తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా సఫలీకృతం కాలేదని పేర్కొన్నారు.
ప్రజలకు తెలుసు..
కశ్మీర్ విభజన తర్వాత కూడా ప్రజలు భయపడుతూ ఇంట్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారని గుర్తుచేశారు. ఇది చూసి ఓర్వలేక ప్రజలను విభజించి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. వారిలో ద్వేషాన్ని వ్యాప్తి చేసి లాభపడదామనుకొన్నారు. కానీ ప్రజలు దానిపై కూడా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.
సమాధానం చెప్పండి
పౌరసత్వ సవరణ చట్టంలో కేవలం ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న హిందూ, సిక్కు, క్రిస్టియన్, బౌద్ద, పార్సీ, జైనులకే మాత్రమే ఎందుకు పౌరసత్వం కల్పించనున్నారని కన్నాన్ నిలదీశారు. మిగతావారిపై వివక్షకు గల కారణం చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై కోర్టులకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మతపరంగా ద్వేషం వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగిత సమస్య ఉందని, ద్రవ్యోల్బణం కూడా ఎక్కువేనని, వృద్ధి రేటు తక్కువగా ఉందని చెప్పారు. కానీ ఓట్ల కోసం నరేంద్ర మోడీ ఇలాంటి విధానాలతో ముందుకెళ్తుందని విమర్శించారు.