పుల్వామా దాడులతో ప్రభుత్వం అలర్ట్: జవాన్లు విమాన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు సెలవుపై వెళ్లాలంటే విమానాల్లో వెళ్లి తిరిగి విమానంలోనే రావొచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో దాదాపు 7.80 లక్షల జవాన్లు లబ్ది పొందనున్నారు.
ఢిల్లీ - శ్రీనగర్, శ్రీనగర్ - ఢిల్లీ, జమ్ము - శ్రీనగర్, శ్రీనగర్ - జమ్ము సెక్టార్లలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు విమాన ప్రయాణం చేయొచ్చంటూ కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు ఈ సదుపాయం మిలటరీలోని ఉన్నత స్థాయి వ్యక్తులకు మాత్రమే ఉండేది. తాజాగా తీసుకొచ్చిన ఆర్డర్తో ఇకపై కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ర్యాంకుల్లో ఉన్నవారు కూడా విమానప్రయాణంకు అర్హత పొందుతారు. జమ్ము కశ్మీర్ నుంచి తమ సొంత ఊళ్లకు సెలవుపై వెళ్లే సందర్భంలో తిరిగి జమ్మూ కశ్మీర్కు చేరుకునేందుకు విమాన సదుపాయం వినియోగించుకోవచ్చని తాజా ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కొత్త ఆదేశాలతో ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని చెబుతూ విధులకు కూడా త్వరగా హాజరవుతారని కేంద్రం పేర్కొంది.
గత వారం జరిగిన పుల్వామా దాడుల తర్వాత కేంద్రం జవాన్లకు ఈ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వస్తుండగా ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40 మంది జవాన్లు మృతి చెందారు. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. జమ్మూ నుంచి శ్రీనగర్కు 78 వాహనాల్లో వస్తుండగా ఈ దాడి జరిగింది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో జవాన్లు వాణిజ్య విమానాల్లో టికెట్లు బుక్ చేసుకుని ఆ తర్వాత రీఇంబర్స్ మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్రం.