డిజిటల్ పేమేంట్స్: రూ. 100 క్యాష్బ్యాక్ ఆఫర్, కేంద్రం కొత్త ప్లాన్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వినియోగదారులతో పాటు వ్యాపారసంస్థలకు కూడ డిజిటల్ చెల్లింపుల ద్వారా చెల్లింపులకు పాల్పడితే క్యాష్బ్యాక్ ఇవ్వాలని కేంద్రం సన్నాహలు చేస్తోంది.
పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో నగదు చెల్లింపులు కూడ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్రం భావించింది. కానీ, ఆశించిన రీతిలో డిజిటల్ చెల్లింపులు నమోదు కావడం లేదు. ఇంకా కూడ ఎక్కువగానే నగదు చెల్లింపులపైనే ఆధారపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించాలని కేంద్రం కొత్త ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.నగదు రహిత చెల్లింపులు చేసే వినియోగదారులకు గరిష్ఠ చిల్లర ధరలో తగ్గింపు ఇస్తారు. ఈ గరిష్ఠ మొత్తాన్ని రూ.100లకు పరిమితం చేస్తారు.
వ్యాపార సంస్థలకు వాటి టర్నోవర్ ఆధారంగా క్యాష్బ్యాక్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే నెల 4న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ ముందు ఈ ప్రతిపాదన పెట్టనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పీఎంవోలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ తరహ ప్రోత్సాహకాలను అమలు చేస్తే నగదు వినియోగం కూడ మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. ప్రతి చిన్న దానికి కూడ నగదు చెల్లింపులపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు.