ప్రతి మూడు నాలుగేళ్లకు కొత్త నోట్లు.. భద్రతా ప్రమాణాల మార్పు : కేంద్రం యోచన
నకిలీ నోట్ల నియంత్రణ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000, రూ.500 నోట్ల భద్రతా ప్రమాణాలను ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి మార్చాలని కేంద్రం యోచిస్తోంది.
న్యూఢిల్లీ: దేశంలో నకిలీ నోట్ల నియంత్రణ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000, రూ.500 నోట్ల భద్రతా ప్రమాణాలను ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
పెద్ద నోట్ల రద్దు అనంతరం అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు వేల రూపాయల నోట్లు ఎక్కువగా పాకిస్తాన్ లో ముద్రించినట్లు విచారణలో వెల్లడైంది. ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) సహాయంతో పాక్ లో నకిలీ నోట్లు ముద్రించగా, బంగ్లాదేశ్ మీదగా వాటిని భారత్ లోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు నెలలుగా పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రతి మూడు లేదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి చెలామణీలో ఉన్న కరెన్సీ నోట్లపై భద్రతా ప్రమాణాలను మార్చుతూ ఉంటాయి.
ఇప్పుడు ఇదే విధానాన్ని మన దేశంలో కూడా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర ఆర్థిక, హోం శాఖల సీనియర్ అధికారులు, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ మెహర్షి హాజరయ్యారు.
సమావేశంలో నోట్ల భద్రతా ప్రమాణాలను మార్చే అంశం ప్రస్తావనకు వచ్చింది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయాలంటే భద్రతా ప్రమాణాలు మార్చడమే మంచిదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.