కార్గో విమానంలో ఢిల్లీ-కోల్కతాకు వెళ్లారా?: ప్రశాంత్ కిషోర్పై దర్యాప్తు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ అమలవుతున్న వేళ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కార్గో విమానంలో ఢిల్లీ నుంచి కోల్కతాకు ఇటీవల ప్రయాణించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ఢిల్లీ, కోల్కతా విమానాశ్రయాల్లోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే, తాను లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి కోల్ కతాకు వెళ్లలేదని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. ఈ క్రమంలో విమానయాన మంత్రిత్వ శాఖ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోందని త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపింది. డీజీసీఏ, విమానాశ్రయ అధికారులు ఈ విషయంపై పరిశీలిస్తున్నారని వెల్లడించింది.
ఢిల్లీ నుంచి బయల్దేరిన మూడు కార్గో విమానాలను పరిశీలించామని, అందులో ప్రశాంత్ కిషోర్ ప్రయాణించినట్లు ఏమీ నిర్ధారణ కాలేదని మరో సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ కార్గో విమానంలో ప్రయాణించారనే విషయం నిర్ధారణ కాలేదని తెలిపారు.
కాగా, కరోనాపై పోరాటంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. ప్రశాంత్ కిషోర్ ను కోల్ కతాకు రావాలని కోరడంతో ఆయన విమానంలో వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు జరుగుతోంది. కాగా, ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల కోసం రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్న విషయం తెలిసిందే.