వ్యవసాయ రంగ బలోపేతానికే నూతన చట్టాలు: కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని, వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళతాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి స్పష్టం చేశారు. నాబార్డ్, ఆసియా పసిఫిక్ దేశాల గ్రామీణ, వ్యవసాయ రుణసంస్థ(ఏపీఆర్ఏసీఏ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని, రైతుల ఆదాయం పెంచేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద దేశంలో 10 కోట్ల 75 లక్షల మంది రైతులకు దాదాపు లక్షా 15వేల కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని తోమర్ తెలిపారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీకి ముందు చూపు ఉందన్నారు. రైతుల సంపద పెరగకపోతే, దేశం మంచి ఆర్థిక వ్యవస్థను సాధించలేదనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని ఆయన వివరించారు.
కాగా, కేంద్రం గత సంవత్సరం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో 11 సార్లు కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపింది. అయితే, ఈ చర్చలు సఫలం కాలేదు. కాగా, గణతంత్ర దినోత్సవం రోజున రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు చర్చలకు కొంత విఘాతం కలిగించాయి.
రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఒకటిన్నర సంవత్సరాలపాటు చట్టాలను వాయిదా వేసేందుకు కేంద్రం ఒప్పుకున్నా.. రైతు సంఘాల నేతలు అంగీకరించకపోవడంతో చర్చలు సఫలం కావడం లేదు. కనీస మద్దతు ధర కూడా ఉంటుందని కేంద్రం చెప్పినా.. చట్టాల రద్దుకే రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. చట్టాలు రద్దు చేసేంత వరకు తమ ఆందోళన సాగుతోందని రైతులు చెబుతున్నారు.