షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలు
టెర్రరిస్టులు.. దేశద్రోహులు.. దళారులు.. ఖలిస్థాన్ తీవ్రవాదులు.. ఇలా తీవ్రమైన నిందలు భరిస్తూనే.. పట్టుసడలించకుండా 56 రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టినట్లయింది. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో వేలాదిగా చేరిన రైతులు మొక్కవోని దీక్షతో నిరసనలు చేసి.. కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచగలిగారు. అవును. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఇన్నాళ్లూ కరాకండిగా వ్యవహరించిన కేంద్రం తొలిసారి దిగొచ్చింది.. చట్టాల నిలుపుదలకు సిద్ధమని ప్రతిపాదించింది..
జామాత దశమగ్రహం! ట్రంప్ అల్లుడు అదుర్స్ -తండ్రి రిటైర్మెంట్.. కూతురు టిఫనీ ఎంగేజ్మెంట్
10 రౌండ్ చర్చల్లో మలుపు..
సంస్కరణ పేరుతో కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో 56 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో బుధవారం కేంద్ర మంత్రులు జరిపిన 10వ రౌండ్ చర్చల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లూ అసలు వెనక్కే తగ్గబోమని చెప్పిన కేంద్రం.. తొలిసారి వెనుకడుగు వేసిందిలా...
ఏడాన్నిరపాటు చట్టాల నిలుపుదల..
రైతులు వ్యతిరేకిస్తోన్న వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలుపుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రం సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు, రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఉమ్మడిగా కమిటీ వేసి వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలపై అధ్యయనం చేస్తామని కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్గోయల్, సోంప్రకాశ్ ప్రతిపాదించారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు.. అంటే.. గరిష్టంగా ఏడాదిన్నర వరకు కొత్త సాగు చట్టాల అమలును వాయిదా వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా సమర్పిస్తామని రైతులకు మాటిచ్చారు. ఈ ప్రతిపాదనలపై చర్చించుకొని నిర్ణయం చెప్పాలని రైతు సంఘాలను కోరారు. అయితే..
నో చెప్పిన రైతులు.. నమ్మలేం..
కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపేస్తామన్న కేంద్రం ప్రతిపాదనతో రైతు ప్రతినిధులు విభేదించారు. కేంద్రం మాటల్ని నమ్మలేమని, సాగు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలని పునరుద్ఘాటించారు. చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదనపై తాము చర్చించుకొని నిర్ణయం చెబుతామన్నారు. వీటిపై..
22న సమస్యకు పరిష్కారం..
బుధవారం నాటి 10వ రౌండ్ చర్చల్లో రెండు వైపుల నుంచి కీలక ప్రతిపాదనలు, సమస్య పరిష్కారం దిశగా ప్రకటనలు వెలువడడగా, రైతులతో కేంద్రం మరోసారి చర్చలు జరుపనుంది. ఎల్లుండి (ఈ నెల 22న) మరోసారి సమావేశమై చర్చలు జరపాలని ఇరుపక్షాలు నిర్ణయించారు. పదో విడత చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమయంలో పరస్పరం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ రోజు జరిగిన చర్చలు రైతుల తమ ఆందోళనల్ని విరమించి, చర్చలు కొనసాగేలా దోహదపడతాయని భావిస్తున్నానన్నారు. ఈ నెల 22న జరగబోయే సమావేశంతో రైతుల ఆందోళన ముగిసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులు మాత్రం కేంద్రం పూర్తిగా చట్టాల్సి రద్దు చేసుకునేదాకా విశ్రమించబోమని చెబుతున్నారు.