వలస కార్మికులపై మరింత ఫోకస్... కొత్త బిల్లుతో వారికి కలిగే ప్రయోజనాలివే....
కార్మిక చట్టాలకు సంబంధించి మూడు కొత్త బిల్లులను శనివారం(సెప్టెంబర్ 19) కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ మూడింటిలో వృత్తిపరమైన భద్రత-ఆరోగ్య&పని వాతావరణం కోడ్ 2020 బిల్లు ఒకటి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వలస కార్మికులకు కార్మిక చట్టాల ద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు... వారికి అందించే సహాయ సహకారాలను మరింత విస్తృతం చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్సభలో మాట్లాడుతూ... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడ రూ.18వేలు వరకు సంపాదించే వలస కార్మికులందరికీ ఈ కొత్త బిల్లు ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల ప్రకారం కాంట్రాక్టర్లు ఎంపిక చేసుకున్న వలస కార్మికులకు మాత్రమే ఆ చట్టాలు వర్తిస్తున్నాయని... ఎవరైతే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లో పని కోసం వెళ్తారో వాళ్లకు అవి వర్తించట్లేదని అన్నారు.
తాజాగా ప్రవేశపెట్టిన బిల్లులో వలస కార్మికులు అనే పదానికి నిర్వచనం ఇచ్చారు. దాని ప్రకారం... యజమాని చేత ప్రత్యక్షంగా ఉద్యోగంలో నియమించబడ్డవారు లేదా ఒక రాష్ట్రంలోని కాంట్రాక్టర్ ద్వారా మరో రాష్ట్రంలో నియమించబడ్డవారు లేదా సొంతంగా ఒక రాష్ట్రం నుంచి వచ్చి మరో రాష్ట్రంలో ఉద్యోగం పొందినవారిని వలస కార్మికులుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ సమయంలో యజమానే వలస కార్మికులకు వసతి సదుపాయం కల్పించాలన్న మునుపటి ముసాయిదాలోని నిబంధనను ఈ బిల్లులో చేర్చకపోవడం గమనార్హం.
అలాగే పని నిమిత్తం మరో చోటుకు వెళ్లినప్పుడు వలస కార్మికులకు కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన భత్యానికి సంబంధించి ఇందులో ఎలాంటి నిబంధన లేదు. అయితే యజమానులు మాత్రం కార్మికులకు ప్రయాణ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కనీసం 10 మంది కార్మికులను నియమించుకునే సంస్థలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఇక మొట్టమొదటిసారిగా వలస కార్మికులు తమ సొంత రాష్ట్రంలో లేదా వేరే రాష్ట్రంలో రేషన్ సదుపాయం కల్పించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పించనుంది. వలస కార్మికులకు సంబంధించిన డేటా నిర్వహణ కోసం ఒక పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వలస కార్మికులు తమ ఆధార్ నంబర్ ద్వారా ఇందులో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.